వారెవ్వా: ఈ జైలు కూడు తింటే శని తొలగిపోయి అంతా మంచే జరుగుతుందట..!
సాధారణంగా జైలు తిండి అంటే అదోలా చూస్తాం.. జైలుకు వెళితే చిప్పకూడే గతి అని అప్పుడప్పుడు అంటుంటాం కూడా.. కానీ దేశంలోని ఒక జైలులో పెట్టే తిండి తింటే శని తొలగిపోయి అదృష్టం అక్కున చేరుతుందని అక్కడి వారి నమ్మకం. అందుకే జైలుకూడుకు అంతలా ఎగబడతారు. ఇంతకీ ఆ జైలు ఎక్కడ ఉంది..? అందులో దొరికే ఫుడ్ ఐటెమ్స్ ఏమిటో ఒకసారి చూద్దాం...
పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా సెంట్రల్ జైలులో అక్కడి ఖైదీలు తయారు చేసే ఆహారానికి యమ డిమాండ్ ఏర్పడుతోంది. ఆ జైలు కూడు తింటే శని దూరంగా ఉండి అదృష్టం దరి చేరుతుందని అక్కడి వారి నమ్మకం. అందుకే జైలులో ఖైదీలు తాము తయారు చేసిన ఆహారాన్ని విక్రయించేందుకు ఓ కేఫ్ జైలు ఆవరణలో ప్రారంభించారు. అంతేకాదు ఇక్కడి వడ్డించే రోటీ తింటే... తిన్న వ్యక్తిపై ఎలాంటి కోర్టు కేసులు, జైలుశిక్ష పడదనేది నమ్మకం. అందుకే ఆ కేఫ్కు ఇప్పుడు జనాలు క్యూకడుతున్నారు.
ఇంకా చెప్పాలంటే ఈ కూడు తినేందుకు సాధారణ వ్యక్తులకంటే బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయనాయకులు ఎక్కువగా వస్తారట. ఒకవేళ అక్కడికి వచ్చేందుకు నామోషీగా ఫీల్ అయితే... తమ వారిని పంపి పటియాలా జైలు ఖైదీలు తయారు చేసిన ఆహారాన్ని పార్శిల్ తెప్పించుకుంటారట. ఇలా ఆ జైలు కూడు తింటే శని తొలగి అంతా మేలే జరుగుతుందని జోతిష్యులు చెప్పడంతో వారి మాటే వేదవాక్కుగా తీసుకుని దాన్ని ఫాలో అవుతున్నారు చాలామంది.
"ప్రభుత్వం మారినప్పుడల్లా చాలా మంది రాజకీయనాయకులు ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ ఖైదీలు తయారు చేసిన ఆహారం కోసం అడుగుతారు. కోర్టు కేసులు ఎదుర్కొంటున్న పలు పారిశ్రామికవేత్తలు అత్యధిక డబ్బులు చెల్లించి ఆహారాన్ని తీసుకెళుతుంటారు " అని జైలు సిబ్బంది ఒకరు తెలిపారు. జైలు ముందు ఆవరణలో ఈ కేఫ్ నడుపుతున్నట్లు అధికారి తెలిపాడు. ఇందులో చపాతీలు, పప్పు, పెరుగు, ఒక మిఠాయితో మెనూ ఉంటుంది. ఇదంతా కలిపి ఒక ప్లేటులో వడ్డిస్తారు. ప్లేటుకు రూ.90 వసూలు చేస్తారు. ఈ కేఫ్ను జైళ్లశాఖా మంత్రి సుఖ్జీందర్ సింగ్ రందావా ప్రారంభించారు. పాటియాలా మేయర్ సంజీవ్ బిట్టుతో కలిసి ఆహారం తీసుకున్నారు.
తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జైల్ కీ రోటీ పేరుతో ఉన్న ఐటెంకు మంచి డిమాండ్ ఉందని తెలిసి అదే ఆహారంగా తీసుకున్నట్లు సుఖ్జీందర్ సింగ్ రందావా తెలిపారు. లోపల ఖైదీలకు మంచి ఆహారం అందించడమే తన లక్ష్యమని సుఖ్జీందర్ సింగ్ తెలిపారు. అందుకే ఖైదీలకు భోజనం కేఫ్ నుంచే అందాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. తద్వారా వారికి మంచి నాణ్యతతో కూడిన ఆహారం వడ్డించినట్లు అవుతుందని వెల్లడించారు. ఈ కేఫ్ నుంచి వచ్చిన డబ్బును ఖైదీల సంక్షేమం కోసం వినియోగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పార్శిల్ భోజనం కోసం జైళ్ల శాఖ ఆ పరిసరాల్లోనే కొన్ని బూతులను తెరచినట్లు మంత్రి వివరించారు.
శనివారం గురువారాల్లో జైల్ కీ రోటీకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోందన్నారు జైల్ సూపరింటెండెంట్ రజన్ కపూర్. ఇప్పుడు నేరుగా జైలులోకి వచ్చి అక్కడే భోజనం చేసే ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే మొబైల్ జామర్స్ జైలు పరిసరాల్లో ఉంచాల్సిందిగా ప్రభుత్వరంగ టెలిఫోన్ సంస్థ బీఎస్ఎన్ఎల్తో ఒప్పందం కుదర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. గ్యాంగ్స్టర్స్ ఇతర కరుడుగట్టిన క్రిమినల్స్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. కరుడుగట్టిన నేరస్తులను సాధారణ జైలు నుంచి మరో బారక్కు తరలించినట్లు చెప్పారు. అక్కడే జామర్స్ బిగించినట్లు చెప్పారు. పాటియాలా జైలులో జామర్లు ఉంచడాన్ని పైలట్ ప్రాజెక్టు పద్ధతిలో ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని చెప్పిన మంత్రి... ఇది విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర జైళ్లలో కూడా జామర్లు బిగిస్తామని చెప్పారు.