కలాం లాస్ట్ ట్వీట్: తమ్ముడ్ని చూపించాలని ఏడ్చారు
న్యూఢిల్లీ/హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చివరి ట్వీట్.. 'నివాసయోగ్యమైన గ్రహం భూమి' అనే అంశంపై మాట్లాడేందుకు షిల్లాంగ్ ఐఐఎం వెళ్తున్నానని, శ్రీజన్ పాల్ సింగ్, శర్మ కూడా వస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు.
కలాం మృతి పైన పలువురు సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్, గవర్నర్ నరసింహన్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులు సంతాపం తెలిపారు.
మాజీ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలామ్ ఆకస్మిక మరణం పట్ల విశ్వయోగి విశ్వంజీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. భారత రాష్టప్రతి పదవికి ఎంతో ఘనకీర్తి తీసుకువచ్చిన కలాంను స్వయంగా ఎదిగిన కర్మయోగిగా అభివర్ణించారు. ఆయన మరణం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికే తీరని లోటన్నారు.
అబ్దుల్ కలం మృతి దేశానికి తీరని లోటు అని, తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని, ఆయన పరిశోధనలు దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయని కాంగ్రెస్ పార్టీ ఏపీ నేతలు చిరంజీవి, రఘువీరా రెడ్డి అన్నారు.
కలాం మృతి పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటి రామారావు, టిడిపి యువనేత నారా లోకేష్ ట్వీట్లు చేశారు. కలాం మృతి పెద్ద లోటు అని, అతను మిసైల్ మ్యాన్ అని, ప్రస్తుత జనరేషన్లో అందరికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలందరు గర్వించదగ్గ మాజీ రాష్ట్రపతి అని కెటి రామారావు ట్వీట్ చేశారు. ఎంతోమందికి ఆయన స్ఫూర్తి అన్నారు.
బోరుమన్న రామేశ్వరం
కలాం జన్మించిన రామేశ్వరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు వందల సంఖ్యలో కలాం ఇంటిముందు గుమిగూడారు. కలాం అన్నయ్య ముత్తుమీరా లెబ్బాయ్ మరైకర్ రామేశ్వరంలోనే ఉంటున్నారు. తమ్ముడి మరణ వార్త విని కన్నీరుమున్నీరు అయ్యారు. తన తమ్ముడ్ని చూపించాలని ఏడ్చారు.