మోడీ కోసం మొగున్ని వదులుకోవడానికైనా సిద్దం: వివాహిత సంచలనం
మోడీ కోసం అవసరమైతే మొగున్ని వదులుకోవడానికైనా సిద్దమేనంటూ రష్మీ జైన్ అనే ఓ వివాహిత సంచలన ప్రకటన చేసింది.
న్యూఢిల్లీ : దేశంలో పెద్దనోట్ల రద్దుపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలు భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. మోడీ నిర్ణయాన్ని సమర్థించేవారు కొందరైతే.. దీనివల్ల సామాన్యులకు కష్టాలు మిగిలాయే తప్ప పెద్దగా ఒరిగిందేమి లేదనేది మరికొందరి అభిప్రాయం.
ఈ నేపథ్యంలోనే.. రష్మీ జైన్ అనే ఓ వివాహిత మోడీ నిర్ణయాన్ని సమర్థిస్తూ సంచలన ఓ ప్రకటన చేసింది. మోడీ కోసం అవసరమైతే మొగున్ని వదులుకోవడానికైనా సిద్దమేనంటూ ప్రకటించింది. తన భర్త మోడీ వ్యతిరేకి అని.. మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, మోడీ నిర్ణయానికి మద్దతు పలుకుతున్న తాను అవసరమైతే భర్తకు విడాకులిచ్చేస్తానని పేర్కొంది.
'దేశ ప్రయోజనాల కోసం మోడీ నిస్వార్థంగా పనిచేస్తున్నారు. మీలో ఎంతమంది మోడీలా నిస్వార్థంగా పనిచేయగలరు?, ఏమి ఆశించకుండా పనిచేసేవారు ఎవరు లేరు. ఇలా క్యూ లైన్లలో నిలబడమన్నది దేశం ప్రయోజనంతో ముడిపడి ఉన్న అంశం. ఏం.. మోడీయే వెళ్లి ఏటీఎంల్లో డబ్బు నింపి రావాలా? ఒకవేళ బ్యాంకు అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు తెలిస్తే.. మీ హక్కు కోసం మీరు పోరాడండి. దేశం కోసం మోడీ ఒక్కరే ఒంటరిపోరు చేస్తున్నారు' అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
తన భర్త యాంటీ-మోడీ అని.. అందుకే మోడీని సమర్థించేందుకు అలాంటి వ్యక్తికి విడాకులు ఇవ్వడానికైనా సరే తాను సిద్దమేనంటూ ప్రకటించింది. ఏదేమైనా మోడీ కోసం భర్తనైనా వదిలేస్తానంటూ ఆమె చేసిన ప్రకటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.