వెయ్యి కోట్ల నష్టం..: పళనిస్వామి ఆదేశాలతో తమిళ ఖజానాకు గండి
500 మద్యం దుకాణాల మూసివేతతో సుమారు రూ.వెయ్యి కోట్ల మేర రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
చెన్నై: పన్నీర్-శశికళ వార్ లో అనుకోకుండా సీఎం పీఠాన్ని దక్కించుకున్న ఎడప్పాడి కె.పళనిస్వామి పాలనలో తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలోని 500 మద్య దుకాణాల మూసివేతకు పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే నెలలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సర్వే అనంతరం మూసివేయబోయే మద్యం షాపుల జాబితాను ప్రకటిస్తారు. అయితే ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడుతున్నట్లు తెలుస్తోంది. 500 మద్యం దుకాణాల మూసివేతతో సుమారు రూ.వెయ్యి కోట్ల మేర రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, తమిళ దివంగత సీఎం జయలలిత గత ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు ఆమె అధికారంలోకి రాగానే తమిళనాట 500మద్య దుకాణాలపై నిషేధం విధించారు. ప్రస్తుతం సీఎం పళనిస్వామి కూడా అదే బాటలో వెళ్తుండటంతో ఆ సంఖ్య ఇప్పుడు వెయ్యికి చేరనుంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం తమిళనాడులో 5700మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఈ ఏడాది మార్చి నాటికి రూ.24వేల కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నారు.
మద్యం దుకాణాల మూసివేతతో పాటు పలు వరాలు కూడా కురిపించారు పళనిస్వామి. పదవి బాధ్యతలు చేపట్టగానే ఆయన ఐదు ఫైళ్ల మీద సంతకం చేశారు. అందులో మహిళా సబ్సిడీ ఫైల్ కూడా ఉంది. ద్విచక్ర వాహన కొనుగోలు కోసం రూ.20వేల వరకు తమిళనాడు ప్రభుత్వం అక్కడి మహిళలకు సబ్సిడీ ఇస్తోంది. ఈ ఫైల్ పై పళనిస్వామి సంతకం చేయడంతో దానికి సంబంధించిన నిధులు విడుదల కానున్నాయి.
అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం తరుపున ఇచ్చే మొత్తాన్ని రూ.12వేల నుంచి రూ.18వేలకు పెంచారు. మత్స్యకారుల కుటుంబాల కోసం హౌజింగ్ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. నిరుద్యోగ యువతకు ఇచ్చే భృతిని కూడా పెంచుతూ పళినిస్వామి నిర్ణయం తీసుకున్నారు.