ఆ ఐదు రైళ్లు.. మర్కజ్ నుంచి 1200 మంది.. రిస్క్లో పడ్డ తోటి ప్రయాణికులు..
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదు భారత్లో కరోనా వైరస్ వ్యాప్తికి హాట్ స్పాట్గా మారింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి మత ప్రార్థనల కోసం ఇక్కడికి వచ్చినవారిలో కొంతమందికి వైరస్ సోకింది. విదేశాల నుంచి మర్కజ్కు వచ్చిన పలువురు మత ప్రబోధకుల వలన వీరికి వైరస్ అంటుకుంది. అయితే వైరస్ సోకిన విషయం తెలియకపోవడంతో.. వీరంతా అక్కడినుంచి ఎవరి రాష్ట్రాలకు వారు వెళ్లిపోయారు. కొంతమంది నిన్నటివరకు(మార్చి 30) వరకు అక్కడే ఉండగా.. ఢిల్లీ ప్రభుత్వం వారిని ఆసుపత్రులకు తరలించింది. దాదాపు 2వేల నుంచి 3వేల మంది వరకు ఈ మర్కజ్ ప్రార్థనలకు హాజరయ్యారని అంచనా వేస్తున్నారు. వీరిలో 1000-1200 మంది ఢిల్లీ నుంచి పలు రైళ్ల ద్వారా తమ రాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో వారు ప్రయాణించిన ఆ రైళ్లు.. వారి వివరాలను కేంద్రం సేకరించే పనిలో నిమగ్నమైంది.

ఆ ఐదు రైళ్లు..
ఢిల్లీ-గుంటూరు దురంతో ఎక్స్ప్రెస్,ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్,చెన్నై గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్,తమిళనాడు ఎక్స్ప్రెస్,న్యూఢిల్లీ-రాంచీ రాజధాని ఎక్స్ప్రెస్.. ఈ ఐదు రైళ్ల ద్వారా మార్చి 13-మార్చి 19 తేదీల్లో మర్కజ్కు వెళ్లినవారు ప్రయాణించినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే మర్కజ్లో కచ్చితంగా ఎంతమంది పాల్గొన్నారు.. అక్కడినుంచి ఎంతమంది రైళ్ల ద్వారా స్వస్థలాలకు వెళ్లిపోయారన్న సంఖ్యపై స్పష్టత రాలేదు. ఒక అంచనా ప్రకారం దాదాపు వెయ్యి నుంచి 1200 మంది ఈ ఐదు రైళ్లల్లో ప్రయాణం చేసినట్టుగా అనుమానిస్తున్నారు. దీంతో వీరి తోటి ప్రయాణికులు,రైల్వే సిబ్బంది కూడా రిస్క్లో పడ్డట్టే అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

సంపర్క్ క్రాంతి.. రాంచీ రాజధాని ఎక్స్ప్రెస్..
ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం.. ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ద్వారా 10 మంది ఇండోనేషియన్లు వయా రామగుండం కరీంనగర్కు చేరుకున్న విషయం తెలిసిందే. వారందరికీ కరోనా పాజిటివ్గా తేలింది. అయితే ఇటీవలే వారికి నెగటివ్గా తేలిందని కూడా తెలంగాణ ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే ముందు జాగ్రత్తగా మరోసారి టెస్టులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇక 60 మంది ప్రయాణికులు ప్రయాణించిన ఢిల్లీ-రాంచీ రాజధాని ఎక్స్ప్రెస్లో బీ1 కోచ్లో ఓ మలేషియన్ మహిళకు పాజిటివ్గా తేలగా.. ఆమె కూడా మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నట్టుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. జార్ఖండ్లో కరోనా మొదటి పాజిటివ్గా కేసుగా తేలింది ఆమెనే కావడం గమనార్హం.

రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్గా మారిన వ్యవహారం..
మార్చి 18న దురంతో ఎక్స్ప్రెస్ ఎస్8 కోచ్లో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులకు కూడా కరోనా పాజిటివ్గా తేలింది. వీరితో పాటు మరో ఇద్దరు కలిసి ప్రయాణించినట్టు గుర్తించారు. ఆ ఇద్దరు తమిళనాడు గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్లో ఎస్3 కోచ్లో ఇద్దరు మైనర్లతో కలిసి ప్రయాణించినట్టుగా గుర్తించారు. అప్పటికీ ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో మర్కజ్ నుంచి వచ్చిన ఎంతోమంది యథేచ్చగా ఆయా రాష్ట్రాల్లో తిరిగారు. వారంతా ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరెవరిని కలిశారన్నది గుర్తించడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడు సవాల్గా మారింది. ఇప్పటికే చాలామందిని గుర్తించిన ప్రభుత్వాలు వారిని క్వారెంటైన్ కేంద్రాలకు తరలించారు. ఇంకా ఆచూకీ తెలియని వారి కోసం అన్వేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications