పట్టుబిగుస్తున్న పన్నీరు: శశికళ చేసిన మూడు తప్పులు!
అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు ముఖ్యమంత్రి పీఠం కలగానే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కరొక్కరుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వైపు వస్తున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళకు ముఖ్యమంత్రి పీఠం కలగానే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కరొక్కరుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వైపు వస్తున్నారు.
మరోవైపు, జయలలిత నివాసం వేదనిలయాన్ని స్మారక చిహ్మంగా మార్చేందుకు సీఎం పన్నీర్ సెల్వం చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు సంతకాల సేకరణ ప్రారంభించారు. జయలలిత అమ్మ సంధ్య (అసలు పేరు వేదవల్లి) పేరుతో ఈ భవంతిని నిర్మించారు.
మూడు దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలకు కేంద్రబిందువుగా ఈ భవనం నిలిచింది. అమ్మ నివసించిన భవనాన్ని స్మారక చిహ్నంగా మార్చాలని జయ అభిమానులు, అన్నాడీఎంకే నేతలు కోరారు.
అయితే జయలలిత మరణం అనంతరం వేదనిలయంలో శశికళ కొనసాగుతున్నారు. ఆమెతో పాటు అనేకమంది కుటుంబసభ్యులు ఇక్కడే ఉండటం గమనార్హం. కొన్ని సంవత్సరాల క్రితం శశికళతో పాటు ఆమె కుటుంబసభ్యులను జయలలిత అక్కడనుంచి వెళ్లగొట్టారు.
అనంతరం కేవలం శశికళను మాత్రమే తిరిగి రప్పించారు. ఇన్నాళ్లు దూరంగా ఉన్న శశి కుటుంబసభ్యులు జయ మరణం తరువాత అక్కడికి చేరుకోవడంపై జయ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దానిని స్మారక చిహ్నంగా మార్చనున్నారు.

అధికారం దూరం
మరోవైపు, శశికళకు అధికారం కూడా నల్లేరుపై నడకలా సాగిపోతుందని భావించిన వ్యవహారం కొరకరాని కొయ్యలా మారింది. గంటల్లో తేలిపోతుందనుకున్న వ్యవహారం రోజులు గడుస్తున్నా కొలిక్కి రాలేదు.

మూడు తప్పులు
పన్నీరు మెరీనా బీచ్లో జయలలిత సమాధి వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి, రెండు నిమిషాలు మాట్లాడడంతో చిన్నమ్మ కలలు కల్లలయ్యాయి. 33 ఏళ్ల నుంచి పెంచుకుంటూ వచ్చిన ఆశలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇందుకు ఆమె చేసిన కొన్ని తప్పులు కారణంగా చెబుతున్నారు. శశికళ ప్రస్తుత పరిస్థితికి ఆమె దూకుడు, వ్యూహం లేకపోవడం, అంతా రహస్యంగా చేయడం లాంటి మూడు ప్రధాన తప్పులు కనిపిస్తాయి.

పారదర్శకత లేకపోవడం.. అంతా రహస్యమే
పారదర్శకత లేకపోవడం శశికళ తొలి తప్పుగా చెబుతున్నారు. శశికళ జీవితంలో మొదటి నుంచి పారదర్శకత లేదు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనప్పటి నుంచి అంతా రహస్యమే. జయలలిత అనారోగ్యం ఏమిటీ? ఎలాంటి వైద్యం అందిస్తున్నారు? అనే విషయాలు అసలు బయటి రాలేదు. కుటుంబసభ్యులను అన్నాడీఎంకే నేతలను ఆసుపత్రి వద్దకు రాకుండా శశికళ పక్కనే ఉండి వ్యవహారం నడిపారు. జయ అనారోగ్యంపై పార్టీ తరపున కానీ, అమ్మ తరుపున కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో పలు అనుమానాలను అందరూ వ్యక్తం చేశారు. జయలలిత మరణంపై న్యాయమూర్తులే అనుమానం వ్యక్తం చేశారు.

అమ్మ వైద్యం విషయంలో అనుమానాలు
అమ్మ జయలలిత వైద్యం విషయంలో గోప్యత పాటించడం ద్వారా ప్రజల్లో అనుమానాలు సృష్టించారు. ఇవన్నీ చాలవు అన్నట్లు జయ మరణించడానికి కొన్ని గంటల ముందు ఎమ్మెల్యేలతో తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ఇవన్నీ శశికళ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి.

తొందరపాటు చర్యలు
తొందరపాటు కూడా శశికళ చేసిన మరో తప్పు. రాజకీయాల్లో ఓపిక చాలా ముఖ్యం. అధికారం కోసం గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు కూడా ఓపిక శశికళలో కనిపించలేదు. జయలలితలా చీర కట్టుకుంటే, ముడి వేసుకుంటే జయలలితలా అయిపోతానని అనుకోవడం అనాలోచిత చర్య అంటున్నారు.

వ్యూహం లేకపోవడం
శశికళ వ్యూహాత్మకంగా వ్యవహరించడం లేదని, కేవలం హడావుడి మాత్రమే చేస్తోందని అంటున్నారు. జయ మృతి తర్వాత.. పార్టీ చీఫ్ పదవి దక్కించుకోవడంలో బీజేపీ పైన ఎత్తుకు పై ఎత్తు వేయడం ద్వారా ఆమె విజయం సాధించారు. కానీ ముఖ్యమంత్రి పీఠం విషయంలో మాత్రం ఆమె సరైన వ్యూహంతో వెళ్లడం లేదంటున్నారు.

వీటిపై క్లారిటీ లేదు
పార్టీ ప్రధాన కార్యదర్శి అయిపోయాక సీఎం సీటు కోసం శశికళ తహతహలాడిపోయారు. సీఎం సీటు కోసం ఆమె వేసిన ఎత్తుగడ బాగానే ఉన్నా, ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కొకొనాలనే దానిపై క్లారిటీ లేకపోవడం. పన్నీరు సెల్వంతో రాజీనామా చేసించి శాసనసభాపక్షనేతగా తాను ఎన్నికైతే ప్రమాణాస్వీకారం చేయచ్చేనే భావించారే తప్ప పార్టీలో చీలిక వచ్చిన పన్నీరు ఎదురు తిరిగినా, మరోరకమైన సమస్య వచ్చిన దాన్ని ఎలా డీల్ చేయాలనే దానిపై శశికళకు క్లారిటీ లేదంటున్నారు. పన్నీరు ఎదురు తిరగగానే రాజీ పడి ఉంటే పరిస్థితులు వేరే రకంగా ఉండేవని అంటున్నారు.












Click it and Unblock the Notifications