ఆశ్రమంలో శిష్యురాళ్లపై లైంగిక దాడులు! వంట చేస్తుండగా.. తుపాకులతో బెదిరించి...
పాట్నా: బీహార్ నవడా జిల్లాలోని ఓ ఆశ్రమంలో ముగ్గురు శిష్యురాళ్లపై సామూహిక లైంగిక దాడి జరిగింది. సంత్ కుటీర్ ఆశ్రమంలోని కొందరు సేవాదార్లు ఆ శిష్యురాలళ్లపై పలుమార్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
డిసెంబర్ 12-17 మధ్య కాలంలో తమపై ఆశ్రమంలోనే పలుమార్లు అత్యాచారం చేశారని, విషయాన్ని పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారని ముగ్గురు మహిళలు తమకు ఫిర్యాదు చేశారని నవడా ఎస్పీ వికాస్ బర్మన్ తెలిపారు.
డిసెంబర్ 12వ తేదీన తాము వంటశాలలో భోజనం తయారీలో నిమగ్నమై ఉండగా సేవాదార్లులో కల్పానాథ్ చౌదరి, గిరిజాశంకర్ చౌదరి, తపస్యానంద్, షీట్ చౌదరి అనేవారు బలవంతంగా లోపలికి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించి తుపాకులు ఎక్కుపెట్టి తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ మహిళలు వివరించారని ఆయన చెప్పారు.
బాధితులు ఈనెల 4వ తేదీన తమకు ఫిర్యాదు చేశారని, నిందితులపై కేసు నమోదు చేశామని, వారంతా ఉత్తర్ప్రదేశ్లోని బస్తీ జిల్లానుంచి వచ్చిన వారని, ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వీరి కోసం గాలించేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ వికాస్ బర్మన్ తెలిపారు.
విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించి పారిపోయారంటూ బాధితులు గురువారం నవడా సివిల్ కోర్టులో తమ వాంగ్మూలాలు ఇచ్చారని, వారికి సదర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించామని వివరించారు.
సంత్ కుటీర్ ఆశ్రమంలో ఇలాంటి అకృత్యాలు ఇదే మొదటిసారి కాదని, కొన్ని నెలల క్రితం ఓ మహిళపై అత్యాచారం జరిగిందని, తుపాకితో బెదిరించడంతో ఆమె మౌనం వహించిందని, కొంతమంది ఎదురు తిరగగా నిందితులు కాల్పులు జరపడంతో ఒకరు గాయపడ్డారని ఈ ముగ్గురిలో ఓ మహిళ చెప్పింది. ఆశ్రమంలో 50 మంది మహిళలు, డజను మంది పురుషులు ఉంటారని, ఆరేళ్లుగా ఈ ముగ్గురు అక్కడ ఉంటున్నారని పోలీసు అధికారి తెలిపారు.