'జమ్మూకశ్మీర్' ఆల్ పార్టీ మీటింగ్ వేళ మూడు చోట్ల ఉగ్ర దాడులు... 48 గంటల హైఅలర్ట్...
జమ్మూకశ్మీర్కి చెందిన అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం(జూన్ 23) భేటీ కానుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. జమ్మూకశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మోదీ ఈ సమావేశంలో చర్చించనున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో జమ్మూకశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదాను పునరుద్ధరించే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో రేపటి సమావేశాన్ని దేశమంతా ఆసక్తిగా గమనించబోతోంది.
మూడు చోట్ల ఉగ్రదాడులు
మరోవైపు ప్రధాని మోదీ ఆల్ పార్టీ మీటింగ్కు ముందురోజు జమ్మూకశ్మీర్లో మూడు వేర్వేరు చోట్ల ఉగ్రదాడులు జరగడం కలకలం రేపుతోంది. పుల్వామాలోని రాజ్పురా చౌక్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు గ్రెనేడ్లతో విరుచుకుపడ్డారు. దీంతో భద్రతా జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.మరో ఘటనలో,షోఫియన్ జిల్లాలోని షిర్మల్ ప్రాంతంలో ఉగ్రవాదికి,భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు.శ్రీనగర్ ప్రాంతంలోని హబకదల్లో జరిగిన మరో ఘటనలో గుర్తుతెలియని వ్యక్తి ఒకరు ఓ యువకుడిని కాల్చి చంపారు. కాల్పులకు పాల్పడిందే ఉగ్రవాదే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
48 గంటల హైఅలర్ట్...
ఢిల్లీలో జమ్మూకశ్మీర్కి చెందిన అన్ని పార్టీల నేతలతో మోదీ సమావేశం నేపథ్యంలో కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి రాబోయే 48 గంటల పాటు హైఅలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే జమ్మూకశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రేపటి సమావేశంలో జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించే అంశంపై చర్చిస్తారా... లేక అక్కడి నియోజకవర్గాల పునర్విభజనపై కమిటీ ఇచ్చే నివేదికకే చర్చ పరిమితమవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే కేంద్రం ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండా ప్రకటించలేదు. దీంతో రేపటి సమావేశం ఏ మలుపులకు దారితీయనుందోనన్న చర్చ జరుగుతోంది.
జమ్మూకశ్మీర్ నుంచి అన్ని పార్టీల నేతలు
జమ్మూకశ్మీర్ నుంచి దాదాపు అన్ని పార్టీల నేతలు గురువారం ఢిల్లీలో జరిగే ఆల్ పార్టీ మీటింగ్కి హాజరవుతున్నారు. ఇందుకోసం జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇప్పటికే శ్రీనగర్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మాజీ డిప్యూటీ సీఎం కవీందర్ గుప్తా,జమ్మూకశ్మీర్ బీజేపీ చీఫ్ రైనా,పీఏజీడీ(గుప్కార్ కూటమి)కి చెందిన కీలక నేతలంతా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం,కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్,జమ్మూకశ్మీర్ పాంథర్స్ పార్టీ నేత ప్రొఫెసర్ భీమ్ సింగ్లు కూడా రేపటి ఆల్ పార్టీ మీటింగ్లో పాల్గొననున్నారు. రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత... తొలిసారిగా ప్రధాని మోదీ నేత్రుత్వంలో కశ్మీరీ నేతలతో జరుగుతున్న సమావేశం కావడంతో దీనిపై అందరి దృష్టి నెలకొంది.