పోలీసులమని చెప్పి ముగ్గురు స్త్రీలపై గ్యాంగ్ రేప్, దోపిడీ
న్యూఢిల్లీ: నోయిడాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తాము పోలీసులమని ఓ కేసులో విచారణ జరపాలని చెప్పి అర్ధరాత్రి ఏడుగురు సాయుధులైన దొంగలు రాత్రి ఇంట్లోకి ప్రవేశించి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఆభరణాలు, డబ్బును దోచుకెళ్లారు. బాధితులంతా దాదాపు 20 ఏళ్ల వయస్సు గల మహిళలే.
ఈ దుర్ఘటన ఢిల్లీ నగర శివార్లలోని గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో జరిగింది. ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న కార్మికుడి ఇంటికి సాయుధులైన దొంగలు పోలీసులమని చెప్పి వచ్చి తలుపు తెరిపించారు. ఆపై ఇంట్లో ఉన్న ఓ మహిళకు తుపాకీ చూపించి బెదిరించి అత్యాచారం జరిపారు. ఒకరి వెంట మరొకరు ఏడుగురు తనపై అత్యాచారం జరిపారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతోపాటు పొరుగున నివాసముంటున్న మరో ఇద్దరు మహిళలపై కూడా దుండగులు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. దొంగలు తనపై అత్యంత కిరాతకంగా అఘాయిత్యం చేస్తున్నా వారి ఎదుట నిస్సహాయంగా ఉండిపోయానని ఓ బాధితురాలు ఎస్పీ సుజాత సింగ్ కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి, బాధితులను వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి పంపించామని ఎస్పీ సుజాత సింగ్ చెప్పారు
అత్యాచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ మహిళను దోపిడీ దొంగలు కొట్టి, ఆమెపై పలుమార్లు అఘాయిత్యం చేశారని స్థానిక నాయకుడు దీరేంద్రసింగ్ చెప్పారు. నిందితులైన దొంగలను అరెస్టు చేయాలని డిమాండు చేస్తూ స్థానిక ప్రజలు పోలీసుస్టేషను ముందు ధర్నా చేశారు. రెండు రోజుల్లోగా నిందితులను అరెస్టు చేస్తామని డీఎస్పీ దిలీప్ సింగ్ హామీతో స్థానిక ప్రజలు ధర్నాను విరమించారు.