ఆ పదానికి అర్థమేంటో చెప్పాలి..? : కేజ్రీకి హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఓ కానిస్టేబుల్ ను తుల్లా అనే పదంతో దూషించడంతో ఆయనపై పరువు నష్టం దావా నమోదయింది. కాగా ప్రస్తుతానికి పరువు నష్టం దావాపై ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ కు స్టే ఇవ్వగా, విచారణ రోజు మాత్రం ఆ పదం ఉపయోగించడంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
అజయ్ కుమార్ తనేజా అనే ఓ ఢిల్లీ కానిస్టేబుల్ సీఎం కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా దాఖలు చేశాడు. నగర పోలీసుల గురించి వివరించే ప్రయత్నంలో కేజ్రీవాల్ 'తుల్లా' (హిందీలో 'తగ్' )అనే పదాన్ని ఉపయోగించారని, అది దూషించడానికి వాడే పదమని కానిస్టేబుల్ పేర్కొన్నాడు. కేజ్రీవాల్ తనను తిట్టాడని, నగర పోలీసుల గురించి సీఎం స్థాయి వ్యక్తే తుల్లా అని తూలనాడితే ఇక సాధారణ జనం పోలీసులను ఏం గౌరవిస్తారని తనేజా అంటున్నాడు.
ఇదిలా ఉంటే, తనేజా దాఖలు చేసిన పరువు నష్టం దావాపై దిగువ కోర్టు కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. కాగా దిగువ కోర్టు ఇచ్చిన సమన్లపై ఆగస్టు 21 వరకు స్టే విధించింది హైకోర్టు. అయితే విచారణ రోజు మాత్రం ఆ పదంపై ఖచ్చితంగా వివరణ ఇచ్చుకోవాలని కేజ్రీవాల్ ను ఆదేశించింది.