ఒంటరైన రాహుల్ - కేజ్రీవాల్ వైపే ఇండియా కూటమి..!!
Delhi Assembly Election 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక సమీకరణాలు తెర పైకి వస్తున్నాయి. ఫిబ్రవరి 3న ప్రచారం ముగియనుంది. దీంతో, మూడు ప్రధాన పార్టీలు తమ ప్రచార సరళి మార్చారు. హామీలు గుప్పిస్తున్నారు. ప్రతీ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో యమునా నదీ వివాదం ఇప్పుడు బీజేపీ - ఆప్ మధ్య ప్రధాన ప్రచార అస్త్రం అయింది. అనూహ్యంగా ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ ను కాదని.. ఆప్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. దీంతో, బీజేపీ కొత్త గేమ్ మొదలు పెట్టింది.
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. ఢిల్లీలో తొలుత త్రిముఖ పోరు అని భావించినా.. ప్రస్తుతం ఆప్ - బీజేపీ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఆప్ నేతలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. బీజేపీ సైతం ఎంపిక చేసిన నేతలను.. మిత్రపక్షాల నాయ కులను ప్రచారంలోకి దించుతోంది. ప్రధాని మోదీ ప్రచారం ప్రారంభించారు. అటు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ మాత్రమే స్టార్ క్యాంపెయినర్ గా కనిపిస్తున్నారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉన్నా.. ఇప్పుడు మిగిలిన పార్టీలు మాత్రం ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కు మద్దతు గా నిలిచాయి. ప్రచారంలోనూ ఆప్ కోసం పని చేస్తున్నాయి.

ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న సమాజ్ వాదీ తో పాటుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సైతం ఢిల్లీలో కేజ్రీవాల్ వైపే నిలబడ్డాయి. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పాటుగా ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఆప్ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసారు. ఇక, టీఎంసీ ఎంపీ శతృఘ్నసిన్హా సైతం ఆప్కు మద్దతుగా ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు కేటాయించారు. 2013 నుంచి వరుసగా ఢిల్లీలో అధికారం దక్కించుకుంటున్న ఆప్ తిరిగి తమ సత్తా చాటాలని భావిస్తోంది. బీజేపీ మాత్రం ఈ సారి గెలవాలనే పట్టుదలతో వ్యూహాలు అమలు చేస్తోంది. దీంతో, ఢిల్లీ ఎన్నికల పోరు రాజకీయంగా మరింత ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications