వివాదం: టోల్ టాక్స్ అడిగిన ఉద్యోగిని బూటుతో కొట్టిన టిఎంసి నేత
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టిఎంసి) మరో వివాదంలో చిక్కుకుంది. ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత టోల్ గేట్ సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అసభ్య పదజాలతో దూషించడమే గాక కాలికున్న బూటు తీసి కొట్టాడు. టోల్ సిబ్బంది టోల్ టాక్స్ చెల్లించమని అడిగినందుకే ఆయనకు ఇంత కోపం వచ్చిందట.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. టిఎంసి నేత, పశ్చిమబెంగాల్ మైనారిటీ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ అయిన అబూ అయేశ్ మండల్ ఆదివారం రాత్రి కోల్కతా నుంచి బుర్ద్వాన్ బయలుదేరారు. హూగ్లీ జిల్లా దంకుని టోల్ వద్ద ఆయన కారును నిలిపేసిన టోల్ గేట్ సిబ్బంది, టోల్ టాక్స్ చెల్లించాలని కోరారు.
ఇందుకు సమాధానంగా తాను ప్రభుత్వ ప్రతినిధినంటూ చెప్పారు. అయితే ‘ఓ సారి మీ ఐడెంటిటీ కార్డు చూపండి సార్' అని టోల్గేట్ ఉద్యోగి ఒకరు ఆయనను అడిగారు. అంతే.. ఒక్కసారిగా కారు దిగిన మండల్ ఆ ఉద్యోగిపై అసభ్య పదజాలంతో దూషించాడు. అంతటితో ఆగకుండా తన కాలి బూటును తీసి అతడ్ని కొట్టాడు.
అడ్డుకునేందుకు వచ్చిన ఇతర సిబ్బందిపైనా మండల్ దాడి చేశాడు. విషయం తెలుసుకున్న మీడియా మండల్ను ఘటనపై ప్రశ్నించింది. వాగ్వాదం జరిగిన మాట వాస్తవమేనని, అయితే తాను ఎవరిపైనా దాడి చేయలేదని మండల్ మీడియాకు తెలిపారు. కాగా, దాడికి గురైన టోల్ సిబ్బంది.. మండల్పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.