2024 ఎన్నికల ప్రధాని రేసులో మమత-బాబుల్ సుప్రియో సంచలన కామెంట్స్
ఈ ఏడాది పశ్చిమబెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఘనవిజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీపై దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే శరద్ పవాతో పాటు మరికొందరు నేతలు మమతను ప్రధాని మోడీని ఢీకొట్టగల సమర్ధమైన నేతగా భావిస్తుండగా.. ఇప్పుడు సొంత పార్టీ టీఎంసీ నేతలు సైతం ఓ అడుగు ముందుకేసి ఆమెను ప్రధాని పదవి రేసులో ఉన్న అభ్యర్ధిగా ఆకాశానికెత్తేశారు.
గత ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్లి ఈ మధ్యే తృణమూల్ కాంగ్రెస్ కు తిరిగివచ్చిన బాబుల్ సుప్రియో ఇవాళ సీఎం మమతా బెనర్జీని ఆకాశానికెత్తేశారు. ఆమె 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రధానమంత్రి అభ్యర్ధి రేసులో ముందున్నారని సుప్రియో వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ మమతా బెనర్జీపై ఎవరూ ఈ తరహా జోస్యం చెప్పలేదు. కానీ సుప్రియో మాత్రం ప్రధాని రేసులో మమత ఉన్నారని చెప్పడం ద్వారా ఈ చర్చ మొదలయ్యేలా చేశారని తెలుస్తోంది.
2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ కెప్టెన్ మమతా బెనర్జీ ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నానని మాజీ కేంద్రమంత్రి కూడా అయిన బాబుల్ సుప్రియో తన మనసులో మాట చెప్పేశారు. ప్రజాస్వామ్యంలో విపక్షం కీలక పాత్ర పోషిస్తుందని, వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధి రేసులో మమతా బెనర్జీ ఉన్నారన్న వాస్తవాన్ని అందరూ అంగీకరించాల్సిందేనని బాబుల్ సుప్రియో తెలిపారు.
జూలైలో మోడీ కేబినెట్ ప్రక్షాళన సందర్భంగా కేంద్రమంత్రి పదవి కోల్పోయిన బాబుల్ సుప్రియో ఆ తర్వాత బీజేపీకి గుడ్ చెప్పారు. అదే సమయంలో రాజకీయాలకు సైతం గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. కానీ మూడు రోజుల క్రితమే మనసు మార్చుకుని టీఎంసీలో చేరిపోయారు. అంతటితో ఆగకుండా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపొ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఇదంతా ఆయన రాజకీయ వ్యూహాల్లో భాగమేనని ప్రత్యర్ధులు చెప్తున్నారు. మరోవైపు టీఎంసీ అధికార పత్రిక జాగో బంగ్లాలో ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడీకి దీటుగా నిలబడటంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విఫలమయ్యారని సంచలన వ్యాసం ప్రచురించిన నేపథ్యంలో బాబుల్ సుప్రియో వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో సుప్రియో వ్యాఖ్యలపై ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది.