Mahua Moitra: లోక్ సభ నుంచి టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణ..
పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధంగా తనకు లభించిన వెబ్ సైట్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకుని నోటుకు ప్రశ్నలు అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించారు. ప్రశ్నకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై ఫిర్యాదుల్ని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారించింది. అనంతరం పార్లమెంట్ కు కళంకం తెచ్చేలా వ్యవహరించిన ఆమె లోక్ సభ సభ్యత్వం రద్దు చేయాలని సిఫార్సు చేసింది.
మహువా మొయిత్రాకు సంబంధించిన నోటుకు ప్రశ్న కేసుపై పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ఇవాళ లోక్ సభకు రిపోర్టు ఇచ్చింది. దీన్ని పరిశీలించిన లోక్ సభ స్పీకర్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ ను కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టింది. దీనిపై విపక్షాలు రచ్చ ప్రారంభించాయి. అయినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. దీంతో లోక్ సభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది.

మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి లోక్ సభ ప్రారంభమైన తర్వాత కూడా టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సిఫార్సు చేస్తూ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై విపక్షాలు నిరసన కొనసాగించాయి. కాంగ్రెస్, టీఎంసీ ఈ వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం కోసం సమయం కావాలని కోరాయి. అయితే గతంలో యూపీఏ హయాంలో ఓటుకు ప్రశ్నల కేసులో కాంగ్రెస్ పార్టీ.. 10 మంది ఎంపీల్ని ఒక్కరోజులోనే బహిష్కరించిన విషయాన్ని బీజేపీ గుర్తు చేసింది.
చివరకు విపక్షాల నిరసన మధ్యే మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
కేంద్రం తీరుపై విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications