గవర్నర్ను వెంటనే తొలగించండి -రాష్ట్రపతికి ఎంపీల మెమొరాండం
ఇంకొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ లో 'కేంద్రం వర్సెస్ రాష్ట్రం' అన్నట్లుగా సాగుతోన్న రాజకీయ క్రీయ కొత్త పుంతలు తొక్కుతోంది. రాష్ట్ర ప్రధమ పౌరుడైన గవర్నర్ జగదీప్ ధనకర్ అచ్చంగా బీజేపీ ఏజెంట్ మాదిరి వ్యవహరిస్తున్నాడని కొంతకాలంగా ఆరోపిస్తోన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ).. గవర్నర్ తొలగింపు డిమాండ్ ను తెరపైకి తెచ్చింది.
బెంగాల్ లో మమతా బెనర్జీ సర్కారు విధానాలు, నిర్ణయాలన్నింటినీ తప్పు పడుతూ, టీఎంసీకి వ్యతిరేకంగా టీవీ ఛానెళ్లలో డిబేట్లు సైతం చేసిన గవర్నర్ ధనకర్ పై మమత మరో అస్త్రం సంధించారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్ ను తక్షణమే విధుల్లో నుంచి తొలగించాల్సిందిగా రాష్ట్రపతిని టీఎంసీ అభ్యర్థించింది. ఈ మేరకు..

తృణమూల్ ఎంపీలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు బుధవారం మెమొరాండం సమర్పించారు. టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పేరుతో రాష్ట్రపతికి పంపిన ఈ మెమొరాండంపై ఇతర టీఎంసీ ఎంపీలు సుదీప్ బంధోపాధ్యాయ్, డెరెక్ ఓబ్రియాన్, కళ్యాణ్ బెనెర్జి, ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ సంతకాలు చేశారు. కాగా,
వెస్ట్ బెంగాల్ లో రాజ్యాంగ విలువలను కాపాడటంలో గవర్నర్ ధన్కర్ పూర్తిగా విఫలమయ్యారని, ఆయన పదేపదే చట్టాలను ఉల్లంఘించారని, సుప్రీంకోర్టు తీర్పులను సైతం పట్టించుకోకుండా గవర్నర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మెమొరాండంలో ఎంపీలు తెలిపారు. గవర్నర్ పై చర్యలు తీసుకునే విషయమై రాష్ట్రపతి కోవింద్ స్పందించాల్సి ఉంది.
బెంగాల్ గవర్నర్ గా ధనకర్ నియమితులైనప్పటి నుంచి సీఎం మమతతో ప్రతినిత్యం విభేదిస్తూ, తరచూ వివాదాస్పదన వ్యాఖ్యలుచేస్తూ వార్తల్లో నిలిచారు. టీఎంసీకి గుడ్ బై చెప్పి ఇటీవల బీజేపీలో చేరిన మంత్రులు, ఎమ్మెల్యేలతో గవర్నర్ ప్రత్యేకంగా చర్చలు జరుపుతుండటం, బీజేపీ వాదనే టీవీల్లోనూ వినిపించడం వివాదాస్పదమైంది.












Click it and Unblock the Notifications