కాల్పులు, బాంబు దాడి: టీఎంసీ కార్యకర్త మృతి, మరో ముగ్గురికి గాయాలు
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మెడినిపూర్ జిల్లాలో ఓ టీఎంసీ కార్యకర్తను దుండగులు కాల్చి చంపారు. ఆ తర్వాత బాంబు దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. మృతి చెందిన వ్యక్తిని సౌవిక్ దోలాయిగా గుర్తించారు.
గాయపడినవారిని మిడ్నాపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నారాయణగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మక్రంపూర్లో రోడ్డు పక్కన కూర్చున్న నలుగురు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై ద్విచక్రవాహనాలపై వచ్చిన దండగులు దాడికి పాల్పడ్డారు.
ఓ బాంబును వారిపై విసిరేశారు. కాల్పులు కూడా జరపడంతో 24ఏళ్ల దోలాయి మృతి చెందాడు. ఆ తర్వాత దుండగులు అక్కడ్నుంచి పరారయ్యారు. అయితే, పలువురు స్థానిక టీఎంసీ నేతలు ఇది బీజేపీ పనేనంటూ ఆరోపిస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుమిత్ దాస్ మాత్రం టీఎంసీ ఆరోపణలను ఖండించారు. ఇది టీఎంసీలోని గొడవల ఫలితమని అన్నారు.
ఈ ప్రాంతంలో తమకు పట్టుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని అడ్డుకోవడానికే ఈ దాడి చేశారు. ఇది బీజేపీ పనే. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నామన్నారు టీఎంసీ జిల్లా అధ్యక్షుడు అజిత్ మైటి.
అయితే, రెండు టీఎంసీల మధ్య ఏర్పడిన గొడవల కారణంగానే ఈ దాడి జరిగిందని, వారిలో వారు దాడులు చేసుకుంటూ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేత సుమిత్ దాస్ అన్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, వారంతా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. నిందితులు ఇంతటి దారుణాలకు తెగబడటానికి వారికి ధైర్యం ఎవరిచ్చారని ప్రశ్నించారు. పరిపాలనా వైఫల్యాల వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇలాంటి దాడులు రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్తితులకు దారితీస్తున్నాయి.