కావేరీ రచ్చ: రజనీకాంత్ సార్ జోక్యం చేసుకోండి, బీజేపీ
బెంగళూరు: తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్యవర్తిత్వం వహించాలని తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మనవి చేశారు.
కావేరీ జలాల సమస్య ఇప్పటికీ కొలిక్కిరాని నేపధ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకుంటారని అన్నారు. కర్ణాటకలో తమిళులపై జరిగిన దాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చెన్నైలోని వల్లువర్ కోట్టాయంలో ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ కర్ణాటకలో తమిళ ప్రజల మీద దాడులు చేస్తున్నారని, అయినా అక్కడి సిద్దరామయ్య ప్రభుత్వం చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు.
బెంగళూరులో నివాసం ఉంటున్న లక్షలాది మంది తమిళులను కన్నడిగులు వేధిస్తున్నారని ఆరోపించారు. 1991లో చోటు చేసుకున్న తరహాలో కర్ణాటకలో ఉన్న తమిళులను వెతివెతికి దాడులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

కర్ణాటకలో స్వార్థ రాజకీయ నాయకులు రెచ్చగొట్టడం వల్లే తమిళుల మీద దాడులు జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. తమిళనాడులో మాత్రం కన్నడిగులకు, వారి ఆస్తులకు పూర్తి రక్షణ కల్పిస్తున్నారని, అయితే అందుకు విరుద్దంగా కర్ణాటక ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.
కర్ణాటకలో అల్లర్లకు బీజేపీ కారణం అని కొందరు అంటున్నారని, అందులో వాస్తవం లేదని తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఈ అల్లర్ల కారణంగా కర్ణాటకకు రూ. 25 వేల కోట్ల నష్టం వచ్చిందని వారే అంటున్నారని ఆమె గుర్తు చేశారు.

తమిళనాడు లారీలు సంచరించకపోవడం వలన రూ. 200 కోట్లు నష్టం వచ్చిందని ఆమె అన్నారు. ఈ అల్లర్లకు, ఈ నష్టానికి ఎవరు భాద్యత వహిస్తారు అని ఆమె ప్రశ్నించారు. శాంతిభద్రతలు కాపాడటంలో విఫలం అయిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య వెంటనే రాజీనామా చెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు.
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన తారలు చేపట్టిన ధర్నా కారణంగా అక్కడి ప్రజలు రెచ్చిపోయారని, రెండు రాష్ట్రాల మధ్య చిచ్చురేపిందని ఆరోపించారు. బెంగళూరుతో పాటు కర్ణాటకలో ఉన్న తమిళ ప్రజలకు రక్షణ కల్పించాలని తమిళిసై సౌందరరాజన్ డిమాండ్ చేశారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు రాష్ట్రాలకు కావలసిన వారని ఆయన కావేరీ జలాల విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె మనవి చేశారు. అయితే నష్టపోయిన తమిళనాడుకు మద్దతుగా రజనీకాంత్ గళం విప్పాలని మనవి చేశారు.

తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు జయలలిత, సిద్దరామయ్య ఇద్దరూ చర్చించే వరకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకోరని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇదే సందర్బంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య దిష్టి బొమ్మను దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications