నల్లదుస్తులతో అమ్మ జయలలితకు నివాళులు అర్పించిన సీఎం, మౌనప్రదర్శన!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలితకు మంగళవారం తమిళనాడులో నివాళులు అర్పిస్తున్నారు. మంగళవారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆయన ఇంటి ముందు జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో సహ పలువురు మంత్రులు, అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు నల్లరంగు దుస్తులు వేసుకుని జయలలితకు నివాళులు అర్పించారు. అమ్మలేని లోటు సంవత్సరం పూర్తి అయినా ఇంత వరకు తీరలేదని సీఎం పళనిస్వామి విచారం వ్యక్తం చేశారు.
జయలలిత మొదటి వర్దంతి సందర్బంగా చెన్నైలో మౌనప్రదర్శన నిర్వహించాలని సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శాంతియుతంగా మెరీనా బీచ్ లో అమ్మ సమాధి వరకూ మౌనప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు.
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్, అమ్మ మేనకోడలు దీపా జయకుమార్ మెరీనా బీచ్ లో అమ్మ సమాధి దగ్గర నివాళులు అర్పించడానికి సిద్దం అయ్యారు. జయలలిత మొదటి వర్దంతి సందర్బంగా భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో చెన్నైలోని మెరీనా బీచ్, జీఎస్ టీ రోడ్డు, అన్నాసలై, కామరాజర్ సలై ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.