పన్నీర్ సెల్వంతో డైరెక్టర్ లారెన్స్ భేటీ: తప్పుడు అవగాహన వల్లే !
చెన్నై: శాంతియుతంగా ఐదురోజులపాటు సాగిన జల్లికట్టు ఉద్యమం పోలీసుల తప్పుడు అవగాహన వల్లే చివరి రోజు రసాభాసగా మారిందని ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత రాఘవలారెన్స్ పేర్కొన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను ఆయన నివాసగృహానికి లారెన్స్, జల్లికట్టు ఉద్యమం విద్యార్థి సంఘాల నాయకులు వెళ్లి కలుసుకున్నారు. జల్లికట్టు నిర్వహణకు తగిన చర్యలు తీసుకున్నందుకు సీఎం పన్నీర్ సెల్వంకు వారు ధన్యవాదాలు తెలిపారు.
లారెన్స్ తో పాటు జల్లికట్టు ఉద్యమ నిర్వహకులు సినీ దర్శకుడు గౌతమన్, మద్రాసు విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాల నాయకులు ప్రదీప్ కుమార్, పార్త్వెదాసన్, మద్రాసు క్రిస్టియన్ కాలేజ్ నాయకుడు అరవింద్ తదితరులు సీఎం పన్నీర్ సెల్వంను కలుసుకున్నారు.
సీఎం పన్నీర్ సెల్వంతో భేటీ అయిన తరువాత లారెన్స్ ముఖ్యమంత్రి నివాసగృహం వెలుపల మీడియాతో మాట్లాడారు. జల్లికట్టు నిర్వహణ కోసం విద్యార్థులు జరిపిన ఉద్యమం శాంతియుత వాతావరణంలోనే జరిగిందని అన్నారు.
ఏ నాయకుడిని కించపరిచే రీతిలో జల్లికట్టు ఉద్యమం జరగలేదని లారెన్స్ స్పష్టం చేశారు. ఉద్యమం విజయవంతం కావడంతో జనవరి 23వ తేదిన 500 కేజీల కేక్ తెప్పించి మెరీనా బీచ్ లో విజయోత్సవ సభ జరుపుకోవాలని అనుకున్నామని చెప్పారు.
అయితే పోలీసుల తప్పుడు అవగాహన కారణంగా చివరి రోజు ఉద్యమం రసాభాసగా మారిపోయిందని లారెన్స్ విచారం వ్యక్తం చేశారు. జల్లికట్టు నిర్వహణ కోసం ప్రత్యేక చట్టాన్ని అసెంబ్లీలో అమోదించినందుకు సీఎం పన్నీర్ సెల్వంకు ఉద్యమం నిర్వహకుల తరుపున ధన్యవాదాలు తెలుపుకున్నామని లారెన్స్ చెప్పారు.
జల్లికట్టు ఉద్యమం ముగింపు రోజు జరిగిన హింసాకాండ సందర్బంగా అరెస్టు అయిన ఉద్యమకారులను విడుదల చెయ్యాలని, గాయాలైన వారికి ప్రభుత్వం వైద్య చికిత్స అందించాలని తాము సీఎం పన్నీర్ సెల్వంకు మనవి చేశామని రాఘవలారెన్స్ మీడియాకు చెప్పారు.