మంత్రి సరోజ లక్ష్యం రూ. 4 వేల కోట్ల లంచం: మీడియాలో, తలపట్టుకున్న పళనిసామి !
తమిళనాడు సంక్షేమ శాఖ మంత్రి సరోజ నాలుగేళ్లలో రూ. నాలుగు వేల కోట్లు సంపాధించాలని లక్షంగా పెట్టుకున్నానని తనతో చెప్పారని, బదిలి చెయ్యడానికి తనను రూ. 20 లక్షలు లంచం ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని
చెన్నై: తమిళనాడు శిశుసంక్షేమ శాఖలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళా అధికారి ఆ రాష్ట్ర సంఘిక సంక్షేమ శాఖా మంత్రి సరోజపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శిశు సంక్షేమ శాఖ అధికారిణిగా పని చెయ్యాలంటే తనను రూ. 20 లక్షలు లంచం ఇవ్వాలని మంత్రి సరోజ డిమాండ్ చేశారని మహిళా అధికారిణి రాజామీనాక్షి సంచలన ఆరోపణలు చేశారు.
ఈనెల 7వ తేదీన చెన్నైలోని ఇంటికి పిలుపించుకున్న మంత్రి సరోజ తనకు లంచం ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించారని మహిళా అధికారి రాజామీనాక్షి బహిరంగంగా మీడియా ముందు ఆరోపణలు చెయ్యడంతో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం హడలిపోయింది.
చంపేస్తాం అని బెదిరించారు
చెప్పిన మాట వినకేంటే నీ పరిస్థితి వేరుగా ఉంటుందని, నీవు ఎలా ఉద్యోగం చేస్తావో మేమూ చూస్తామని నన్ను బెదిరించారని రాజామీనాక్షి ఆరోపించారు. మంత్రి సరోజ, ఆమె కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని మహిళా అధికారిని రాజామీనాక్షి చెన్నై నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చెయ్యడంతో తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
లిఖితపూర్వకంగా ఫిర్యాదు
ధర్మపురి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిగా పని చేస్తున్న రాజామీనాక్షి మంత్రి సరోజ మీద లిఖితపూర్వకంగా చెన్నై నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి సరోజ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె చెన్నై నగర పోలీసు కమిషనర్ కు మనవి చేశారు.
జయలలిత నియమించారు
మంత్రి సరోజ మీద ఫిర్యాదు చేసిన అనంతరం రాజామీనాక్షి మీడియాతో మాట్లాడారు. ధర్మపురి జిల్లా శిశు సంక్షేమ శాఖలో తాను భద్రతాధికారిణిగా పని చేస్తున్నానని అన్నారు. జయలలిత తనను స్వయంగా ఈ పదవిలో నియమించారని ఆమె చెప్పారు.
విధుల్లో అమ్మ మెచ్చుకున్నారు
తను విధుల్లో ఎంతో మంచిపేరు తెచ్చుకున్నానని, జయలలిత కూడా నన్ను అభినందించారని రాజామీనాక్షి అన్నారు. అయితే జయలలిత మరణించిన తరువాత తనను ఆ బాధ్యతల్లో సరిగా పని చెయనీయలేదని ఆరోపించారు.
ఇప్పటికే రూ. 10 లక్షలు ఇచ్చాను
మంత్రి సరోజ కారణంగా తరచూ ఒత్తిడి ఎక్కువ అయ్యిందని, విధుల్లో ఉండాలంలే రూ. 10 లక్షలు ఇవ్వాలని మంత్రి భర్త తనను బెదిరించారని రాజామీనాక్షి ఆరోపించారు. ఒత్తిడి ఎక్కువ కావడంతో ఫిబ్రవరి నెలలో మంత్రి సరోజకు రూ. 10 లక్షలు ఇచ్చానని రాజామీనాక్షి ఆరోపించారు.
బిడ్డ కోసం, అనారోగ్యం
అనారోగ్య కారణంగా, బిడ్డ పెంపకం కోసం తనను చెన్నై బదిలి చెయ్యాలని మంత్రికి వినతి పత్రం ఇచ్చానని, ఆ విషయంపై మాట్లాడటానికి తనను ఇంటికి రావాలని మంత్రి సరోజ సూచించారని రాజామీనాక్షి చెప్పారు. ఈనెల 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు చెన్నైలోని మంత్రి సరోజ ఇంటికి తాను వెళ్లానని అన్నారు.
రూ. నాలుగు వేల కోట్ల లంచం లక్షం !
నీ బదిలి విషయం పరిశీలించానని, నువ్వు చెన్నైకి బదిలి కావాలంటే రూ. 20 లక్షలు చెల్లించాలని మంత్రి సరోజ చెప్పారని, తాను నాలుగేళ్లలో రూ. నాలుగు వేల కోట్లు సంపాధించాలని లక్షంగా పెట్టుకున్నానని మంత్రి తనతో చెప్పారని, రూ. 20 లక్షలు ఇవ్వకుంటే అదే మొత్తం ఇవ్వడానికి వేరేవారు సిద్దంగా ఉన్నారని, వారికే ఆబాధ్యతలు అప్పగిస్తానని మంత్రి సరోజ అన్నారని రాజామీనాక్షి మీడియాకు చెప్పారు.
నామరూపాలు లేకుండా చేస్తాం
నా మాట ధిక్కరించినా, లంచం విషయం బయటకు చెప్పినా ఉద్యోగం ఊడగొట్టడంతో పాటు నిన్ను నామరూపాలు లేకుండా చేస్తామని మంత్రి సరోజ, ఆమె భర్త బెదిరించారని, నాకు, నా కుటుంబ సభ్యులకు మంత్రి సరోజ, ఆమె భర్త వలన ప్రాణహాని ఉందని, మాకు రక్షణ కల్పించాలని చెన్నై నగర పోలీసు కమిషనర్ కు మనవి చేశానని మహిళా అధికారిని రాజామీనాక్షి మీడియా ముందు వాపోయారు.
సిగ్గులేదా, బర్తరఫ్ చెయ్యండి
లంచం కోసం మహిళా అధికారిణిని బెదిరించిన మంత్రి సరోజను వెంటనే బర్తరఫ్ చెయ్యాలని, ఇది చాల సిగ్గుపడాల్సిన విషయం అంటూ తమిళనాడు ప్రధాన పత్రిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ మండిపడ్డారు. మంత్రి సరోజను వెంటనే పదవి నుంచి తప్పించాలని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ డిమాండ్ చేశారు.