ఎరుపు వర్ణంలో తమిళనాడు చెరువులు: కారణమదే?.. ఆదుకోరా!
చెన్నై: ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేకపోవడంతో.. రైతులు అల్లాడిపోతున్నారు. మార్కెట్ దాకా తీసుకెళ్తే.. కనీసం ట్రాన్స్ పోర్ట్ చార్జీలు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తమిళనాడు టమాటా రైతులంతా తమ పంటను చెరువుల్లో డంప్ చేస్తున్నారు. దీంతో అక్కడి చెరువులన్ని ఎరుపు వర్ణాన్ని తలపిస్తున్నాయి.

రూ.2కి పడిపోయిన ధర
నిన్న మొన్నటివరకు కిలో రూ.20 పలికిన టమాటా ఒక్కసారిగా రూ.2కి పడిపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో తమిళనాడులో టమాటా ఎక్కువగా పండించే రాయకొట్టై,క్రిష్ణగిరి,వలప్పాడి జిల్లాల రైతులు పండించిన పంటను చెరువుల్లో పారేస్తున్నారు. తమిళనాడు రైతు సంఘం అధ్యక్షుడు సింగమణి ఈ విషయాన్ని వెల్లడించారు.

ధర ఎందుకు పడిపోయింది?:
తక్కువ కాలంలో తక్కువ నీటితోనే టమాటా పండించే అవకాశం ఉండటంతో ఎక్కువమంది రైతులు దాన్నే పండించారని సింగమణి తెలిపారు. ఫలితంగా ఉత్పత్తి పెరిగి డిమాండ్ పడిపోయిందని అన్నారు. టమాటాలను ఎక్కువ రోజులు నిల్వ చేసే అవకాశం కూడా ఉండదు కాబట్టి.. గిట్టుబాట ధర లేక వాటిని చెరువుల్లోనే పారబోస్తున్నారని ఆయన చెప్పారు.
పెట్టిన పెట్టుబడి కూడా..
మూడు నెలల క్రితం కిలో టమాటా రూ.20 పలికిందని, గత నెల రూ.7కి పడిపోయి, ఇప్పుడు పూర్తిగా రూ.2కి పడిపోయిందని సింగమణి చెప్పారు. పండించిన పంటకు కనీసం పెట్టుబడి, కూలీల ఖర్చు, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

కేంద్రమే ముందుకు రావాలి..
అన్నాడీఎంకె అధికార ప్రతినిధి కేసీ పళనిస్వామి రైతుల గిట్టుబాటు ధరపై స్పందించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ పాలసీతో ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పండించే ప్రతీ పంటకు కనీస మద్దతు ధర అందించేలా ప్రభుత్వ చర్యలు ఉండాలన్నారు. అలాగే స్టోరేజ్ సౌకర్యాలను కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications