మిత్రుల్ని వదిలించుకోబోతున్న విజయ్..? ఉప ఎన్నికలే ముహుర్తం..!
తమిళనాడు రాజకీయాల్లో అధికార కూటమిలో మిత్రపక్షాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి విజయ్ (Vijay)చేసిన ఘాటు వ్యాఖ్యలు, ప్రతిపక్ష నేత స్టాలిన్ను అనుకరిస్తూ చేసిన హావభావాలు సొంత కూటమిలోనే తీవ్ర దుమారానికి దారితీశాయి. దీంతో సీఎం విజయ్, ఆయన మిత్రపక్షాలైన లెఫ్ట్ పార్టీలు, వీసీకేల మధ్య ఇప్పుడు తీవ్ర రాజకీయ యుద్ధం నడుస్తోంది.
విజయ్ పై ఆగ్రహంగా మిత్రపక్షాలు (Vijay)
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం విజయ్ గత డీఎంకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని గట్టి కౌంటర్లు ఇచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో మద్యం అమ్మకాల (టాస్మాక్) ద్వారా పెద్ద ఎత్తున పార్టీ నిధులు వసూలు చేసేవారని, తాము అధికారంలోకి వచ్చాక దానికి అడ్డుకట్ట వేశామని పేర్కొన్నారు. కొందరు తానేదో సినిమా షూటింగ్ నుంచి నేరుగా వచ్చి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నట్లు అవాస్తవ ప్రచారం చేస్తున్నారని, కానీ తన రాజకీయ ప్రస్థానం 'రీల్' కాదు, సవాళ్లతో కూడిన 'రియల్' ప్రయాణమని ఆయన స్పష్టం చేశారు.

స్టాలిన్ కు వెక్కిరింతలపై ఫైర్
ఈ ప్రసంగంలో సీఎం విజయ్.. గత ప్రభుత్వాల అవినీతి పనితీరును విమర్శిస్తూనే, ప్రతిపక్ష నేత స్టాలిన్ శైలిని అనుకరిస్తూ చేసిన చేష్టలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 1990ల నుంచే తన అభిమాన సంఘాల ద్వారా ప్రజలకు అండగా నిలిచానని గుర్తుచేసిన ఆయన, తాను కొలత్తూర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో కాసేపు మాట్లాడినందుకే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనుకూలంగా మారిపోయాయంటూ స్వీయ ప్రశంసలు చేసుకోవడం కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి సొంత కూటమి పార్టీలు సీఎం విజయ్ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుబట్టాయి. అసెంబ్లీ వేదికగా సినిమా ప్రచార శైలిని ప్రదర్శించడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమంటూ మిత్రపక్షాల నేతలు విమర్శించారు. గతంలో స్టాలిన్ ఎప్పుడూ విజయ్ను వ్యక్తిగతంగా అగౌరవపరచలేదని, కానీ సీఎం హోదాలో సభలో ఇలాంటి అనుకరణలు చేయడం సరికాదంటూ నేరుగానే ఈ విషయాన్ని సీఎం విజయ్ దృష్టికి తీసుకెళ్లారు.
మిత్రుల్ని వదిలించుకోబోతున్న విజయ్ ?
ఈ విమర్శలపై సీఎం విజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తమిళనాడు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తమ ప్రభుత్వంలో భాగస్వామ్యపక్షాలుగా ఉంటూ, కీలక మంత్రి పదవులను అనుభವಿస్తూ కూడా ముఖ్యమంత్రిపైనే ఇలాంటి బహిరంగ విమర్శలు చేయడం ఏంటని ఆయన ఆగ్రహించినట్లు సమాచారం. తాను ఏం చేసినా తప్పు పడుతున్నారని, మిత్రపక్షాలను దీర్ఘకాలం నమ్ముకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని విజయ్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఉపఎన్నికల్లో ఒంటరి పోరే
మిత్రపక్షాలపై ఆధారపడటం పూర్తిగా తగ్గించి, భవిష్యత్తులో ఒంటరిగానే బరిలోకి దిగాలనే కొత్త వ్యూహాన్ని సీఎం విజయ్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికోసం క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను బలోపేతం చేయడంతో పాటు, రాబోయే ఉపఎన్నికలలో సొంత బలంతోనే సింగిల్ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. మిత్రుల నుంచే రాజకీయ ప్రతిఘటన ఎదురుకావడంతోనే విజయ్ ఈ వ్యూహాత్మక మార్పునకు సిద్ధమైనట్లు రాజకీయ శ్రేణులు భావిస్తున్నాయి.














Click it and Unblock the Notifications