మందుబాబులకు సర్కార్ షాక్... మద్యం కొనుగోలు చేయాలంటే ఇక అది తప్పనిసరి...
మందుబాబులకు తమిళనాడు సర్కార్ షాకిచ్చింది. మద్యం కొనుగోలుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నవారికి మాత్రమే మద్యం విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికైతే ఇది నీలగిరి జిల్లాకే పరిమితం. ఈ మేరకు నీలగిరి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
నీలగిరి పర్యాటక ప్రాంతమనే విషయం తెలిసిందే.గత రెండు రోజులుగా ఇక్కడ పర్యాటకుల రద్దీ పెరిగింది. స్థానికంగా 97శాతం వ్యాక్సినేషన్ జరిగినప్పటికీ... ఇంకా కొంతమంది లేనిపోని అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోవట్లేదు. వీరిలో మందుబాబులే ఎక్కువగా ఉన్నారు. నిత్యం మందు తాగే తమకు వ్యాక్సిన్ వేయించుకుంటే ఆరోగ్యం చెడిపోతుందని లేనిపోని అపోహలు సృష్టించుకున్నారు. దీంతో అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారు వ్యాక్సిన్ వేయించుకోవట్లేదు.
పర్యాటకుల తాకిడి పెరుగుతుండటంతో వ్యాక్సిన్ వేయించుకోని మందుబాబుల కారణంగా ఎక్కడ వారు వైరస్ బారినపడుతారేమోననే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే నీలగిరి జిల్లా కలెక్టర్ మందుకు,వ్యాక్సిన్ సర్టిఫికెట్కు ముడిపెట్టారు. వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న సర్టిఫికెట్తో పాటు ఆధార్ కార్డును మద్యం షాపులో చూపిస్తేనే మద్యం విక్రయించాలనే నిబంధన తీసుకొచ్చారు. దీంతో మందుబాబులు అనివార్యంగా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు.
నీలగిరి కలెక్టర్ దివ్య దీనిపై మాట్లాడుతూ... 'నీలగిరి జిల్లాలో ఇప్పటివరకూ 97శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. అయితే కొంతమంది మందుబాబులు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడానికి ససేమిరా అంటున్నారు. మద్యం సేవించేవారు వ్యాక్సిన్ తీసుకుంటే ఏదో జరిగిపోతుందనే భ్రమలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు ఈ కొత్త రూల్ తీసుకొచ్చాం. మద్యం షాపు కౌంటర్ వద్ద వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపిస్తేనే మద్యం విక్రయించాలని ఆదేశాలిచ్చాం.' అని తెలిపారు.
కరోనా కేసుల విషయానికి వస్తే... గురువారం(సెప్టెంబర్ 2) తమిళనాడులో 1562 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26,17,943కి చేరింది. ప్రస్తుతం 16,478 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 20 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 34,961కి చేరింది.
Recommended Video
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,352 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక రోజు 366 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,29,03,289 కి చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 4,39,895కి చేరింది.నిన్న ఒక రోజు 366 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,39,895కి పెరిగింది.నిన్న74 .84 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. ఇప్పటివరకూ మొత్తంగా 67.09కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.