మోడీ కోసం: బిజెపితో బాబు, పవన్ కళ్యాణ్, జెపి
హైదరాబాద్: నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి బిజెపి మాత్రమే కాకుండా ఇతర పార్టీలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ కీలకం కావడంతో ఇక్కడి పార్టీలను ఒక్క తాటిపైకి తెచ్చి మహా కూటమిని ఏర్పాటు చేసేందుకు బిజెపి ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
జయప్రకాష్ నారాయణ లోకసత్తా, పవన్ కళ్యాణ్ జనసేన, నారా చంద్రబాబు నాయుడి తెలుగుదేశం బిజెపితో కలిసి పనిచేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నాలుగు పార్టీలతో ఇటు తెలంగాణలోనూ అటు సీమాంద్రలోనూ మహా కూటమి ఏర్పబోతున్నది. ఈ విషయాన్ని లోకసత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ శనివారం ధ్రువీకరించారు.
వచ్చే ఎన్నికల్లో గ్రాండ్ అలయన్స్ ఉంటుందని లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారయణ ధృవీకరించారు. లోక్సత్తా, బిజెపి, టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఆయన ప్రకటించారు. శనివారం పార్టీ నేతలతో భేటీ అయిన జేపీ అనంతరం మీడియాతో మాట్లాడారు నాలుగు పార్టీలకూ ఉమ్మడి ఎజెండాను సిద్ధం చేయాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ అంశంపై కసరత్తు జరుగుతోందని, సీట్ల పంపకం తదితర అంశాలపై మరో వారం రోజుల్లో స్పష్టత రానున్నట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బిజెపి నాయకులు సుముఖంగా లేరు. అయినప్పటికీ జాతీయ నాయకులు మాత్రం పొత్తుకే మొగ్గు చూపుతున్నారు. టిడిపితో పొత్తుకు తమ పార్టీ తెలంగాణ నేతలను ఒప్పించేందుకు ప్రకాష్ జవదేకర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. టిడిపితో పొత్తు లేకుంటే మోడీని ప్రధానిని చేయడం సులభం కాదనే విషయాన్ని ఆయన పార్టీ నేతలకు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందనే ఉద్దేశంతోనే సీమాంధ్రలో పలువురు కాంగ్రెసు నాయకులు బిజెపిలో చేరుతున్నారు. పురంధేశ్వరి ఇంతకు ముందు చేరినా, మూడు రోజుల్లో మరో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు బిజెపిలో చేరడానికి సిద్ధపడినా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందనే ఉద్దేశంతోనే అని అంటున్నారు.
సీమాంధ్రలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్యనే పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్థితిలో వైయస్సార్ కాంగ్రెసును ఓడించడానికి, కాంగ్రెసును పూర్తిగా దెబ్బ తీయడానికి మహా కూటమి అవసరమనే అవగాహనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా భావిస్తున్నారు. దానికితోడు, జనసేన, లోకసత్తా, బిజెపిలో పొత్తు వల్ల తెలంగాణలో కూడా కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.