కశ్మీర్ ఎజెండా ముందే లీకైందా..? సోషల్ మీడియాలో సీక్రెట్ డాక్యుమెంట్స్..?
అత్యంత సున్నితమైన అంశాలను ప్రభుత్వాలు డీల్ చేసే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. ఏదైనా బిల్లును రూపొందించాలన్నా దానికి సంబంధించి గ్రౌండ్ జీరో నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే అత్యంత సున్నితమైన జమ్ము కశ్మీర్ విభజన బిల్లుకు సంబంధించి అత్యంత రహస్యంగా ఉండాల్సిన షెడ్యూల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మినిట్ టూ మినిట్ షెడ్యూల్ అందులో ఉంది. అంతేకాదు డాక్యుమెంట్ కుడి వైపు పైన "టాప్ సీక్రెట్" అని ఇంగ్లీషులో రాసి ఉంది. జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ తీర్మానం ఎప్పుడు ప్రవేశ పెట్టాలి, అంతకుముందు రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లాల్సిన సమాచారం, ఉపరాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్లాల్సిన సమయం అన్ని ఆ డాక్యుమెంట్లో ఉన్నాయి. అంతేకాదు సభలో ఎన్నిగంటలకు తీర్మానం ప్రవేశపెట్టాలనేది కూడా అందులో ఉంది.
జమ్ము కశ్మీర్కు సంబంధించిన మొత్తం వ్యవహారం ఉన్న షెడ్యూలును అమిత్ షా పార్లమెంటుకు తీసుకొస్తున్న సమయంలో అతని చేతిలో ఉన్న పేపర్లను ఓ న్యూస్ ఏజెన్సీకి చెందిన ఫోటోగ్రాఫర్ ఫోటో తీశారు. ఇది సోషల్ మీడియాలో పోస్టు చేయగానే వైరల్ అయ్యింది. జమ్ము కశ్మీర్కు సంబంధిచిన పూర్తి ప్రణాళిక ఆ డాక్యుమెంట్లో ఉంది. అంటే ఆర్టికల్ 370 ఆర్టికల్ 35 ఏల రద్దు దగ్గర నుంచి ఆ తర్వాత కార్యాచరణ వరకు మొత్తం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. రాజ్యసభలో అమిత్ షా ప్రకటన చేయక కొన్ని నిమిషాల ముందు ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
మేనిఫెస్టోలోనే నాడు స్పష్టం చేసిన బీజేపీ: నేడు ఆచరణలో 370 రద్దు
ఇక ఆ పేపర్లో అజెండా మొత్తం ఉంది. రాష్ట్రపతికి సమాచారం అందివ్వడం, కేబినెట్ మీటింగ్, రాష్ట్రపతి నోటిఫికేషన్, పార్లమెంటులో బిల్లు పాస్ అవడం, రాజ్యసభలో సెక్యూరిటీ, జమ్ము కశ్మీర్కు హోమ్ సెక్రటరీని పంపడం, వంటి అంశాలు ఉన్నాయి. ఈ చర్యలన్నిటినీ మూడుగా విభజించారు. ఒకటి రాజ్యాంగపరమైనదిగా రెండు రాజకీయపరమైనదిగా మూడు శాంత్రి భద్రతల అంశాలుగా విభజించారు. అంతేకాదు ముందుగా ఉన్న యాక్షన్ ప్లాన్ ప్రకారం ఎవరు ఏ సమయంలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తారో కూడా అందులో ఉంది.
ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యం కాగానే అమిత్ షా సభలో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. అంతేకాదు రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడుతుందనే ప్రకటన చేశారు. అసెంబ్లీతో కూడిన జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, అసెంబ్లీ లేకుండా లడఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం అని షా చెప్పారు. ఇక ఆ షెడ్యూల్లో ఉన్న ప్రకారమే అన్ని జరిగాయి. క్రమం తప్పకుండా తమ ప్రణాళికను పక్కాగా అమలు చేసి విజయవంతంగా ఆపరేషన్ కశ్మీర్ను బీజేపీ సర్కార్ పూర్తి చేసింది.