ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాప్ 5 టూరిస్ట్ డెస్టినేషన్స్ ఇవే..
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్యామిలీతో కలిసి టూర్ లకు వెళ్తున్నారు. ప్రకృతిలో అలా సరదాగా గడిపేందుకు ఇష్టపడుతున్నారు. అలా ఇప్పటికే చూసిన పర్యాటక ప్రదేశాలు బోర్ కొట్టి కొత్త కొత్త టూరిస్టు ప్రాంతాలను అన్వేషిస్తున్నారు. అటు సామాజిక మాధ్యమాల్లోనూ పర్యటక ప్రాంతాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పలు టూరిస్టు ప్రాంతాలు పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. క్రమంగా ఈ ప్రాంతాలకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. మరి ఆ పర్యాటక ప్రాంతాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
గతంలో టూర్ అనగానే చాలామందికి గోవా గుర్తుకువచ్చేది. యువత ఎక్కువగా గోవా టూర్ కు వెళ్లేవారు. కానీ ఇప్పుడు గోవా కాకుండా హిల్ స్టేషన్స్, దట్టమైన అడవిలో ట్రెక్కింగ్, జలపాతాలు ఇలా సాహసోపేతమైన జర్నీ చేసేందుకు ఇష్టపడుతున్నారు. మరి ఆ ప్రాంతాల వివరాలు చూస్తే అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతం ఇటీవలి కాలంలో చాలా ఫేమస్ అయింది. ఈశాన్య రాష్ట్రంలోని ఈ ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరుగుతోంది. తవాంగ్ ప్రాంతం ప్రకృతి రమణీయమైన వాతావరణానికి అనుకూలమైనదిగా ఉంది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం, బౌద్ధ సంస్కృతి టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రద్దీ వాతావరణానికి దూరంగా ప్రశాంతంగా గడిపేందుకు ఇది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు.
కర్ణాటకలోని గోకర్ణ ప్రాంతం అటు ఆధ్యాత్మికత ఇటు బీచ్ లతో ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా ఉంది. ఇక్కడి ప్రాంతాన్ని సందర్శిస్తే అటు పుణ్యక్షేత్రంలో దర్శనం అలాగే అందమైన బీచ్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. గోవాలో కంటే స్వచ్ఛమైన బీచ్ లు, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. సముద్రం ఒడ్డున వాకింగ్, యోగా కేంద్రాలు, ఆరోగ్య రిట్రీట్లు పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

అలాగే గుజరాత్ లోని ధోలావీరా భారత్ లోని ప్రాచీన నగరంగా ఉంది. యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగానూ గుర్తింపు పొందింది. ప్రాచీన భారత నాగరికత గురించి తెలుసుకోవాలని అనుకునే వారికి ఈ ప్రాంతం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక మధ్య ప్రదేశ్ లోని మండు ప్రాంతం కూడా చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అఫ్గాన్ శైలిలో నిర్మించిన కోటలు, రాజభవనాలు, మసీదులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. వీటితోపాటు అసోంలోని మజూలీ ద్వీపం.. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎకో టూరిజం, కమ్యూనిటీ టూరిజం ద్వారా స్థానిక జీవన విధానాన్ని దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది. ఈ ప్రాంతాల్లో రద్దీ తక్కువగా ఉండం.. ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉండటం కారణంగా ఇవి ఇటీవలి కాలంలో ప్రసిద్ధి చెందుతున్నాయి.












Click it and Unblock the Notifications