టెలికాం సంస్థలకు ట్రాయ్ షాక్: అందుకు ససేమిరా!, అవసరం లేదన్నారు..
కాల్స్, డేటాకు కనీస ఛార్జీలు వర్తింపజేయాలన్న టెలికాం సంస్థల విన్నపాన్ని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ: కాల్స్, డేటాకు కనీస ఛార్జీలు వర్తింపజేయాలన్న టెలికాం సంస్థల విన్నపాన్ని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) తోసిపుచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో కనీస ఛార్జీల అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రాయ్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు.
టెలికాం సంస్థల అభ్యర్థనపై చర్చించడానికి.. సంస్థ ప్రతినిధులతో శుక్రవారం ఆర్ఎస్ శర్మ భేటీ అయ్యారు. భేటీ అనంతరం.. కనీస ఛార్జీల విధింపు అనేది ప్రస్తుత పరిస్థితుల్లో పనిచేయదని తెలిపారు. సుదీర్ఘ ఆలోచన తర్వాతే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చామని చెప్పారు. దీనిపై తదుపరి వాదనకు అవకాశం లేదని కూడా స్పష్టం చేయడం గమనార్హం.
కాగా, జియో రాకతో నష్టాల్లో కూరుకుపోయిన పలు టెలికాం కంపెనీలు ఈ ప్రతిపాదనను ట్రాయ్ ముందు పెట్టాయి. అయితే జియో మాత్రం ఈ వాదనను తప్పుపట్టింది. కనీస ఛార్జీల నిబంధన అవసరం లేదని తెలిపింది. అయితే జియో వల్ల కలిగిన నష్టాలను పూడ్చుకునేందుకే టెలికాం సంస్థలు ఈ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఉచితంగా జియో ఫోన్ ఇస్తామంటూ తాజాగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చేసిన ప్రకటనతో పలు కంపెనీల షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. అదే సమయంలో రిలయన్స్ షేర్లు మాత్రం లాభాలను దక్కించుకోవడం గమనార్హం.