బెంగాల్లో రైలు ప్రమాదం: పట్టాలు తప్పిన బికనీర్-గౌహతి ఎక్స్ప్రెస్; కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
పశ్చిమ బెంగాల్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గౌహతి-బికనీర్ ఎక్స్ప్రెస్ గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఉత్తర బెంగాల్లోని మోయినగురి వద్ద ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో పట్టాలు తప్పింది. రైలు పట్టాలు తప్పడంతో నాలుగైదు కంపార్ట్మెంట్లు బోల్తా పడ్డాయని సమాచారం . కనీసం 12 కోచ్లు దెబ్బతిన్నాయని రైల్వే అధికారులు చెప్తున్నారు. ప్రాణనష్టం గురించి ఇంకా ఎటువంటి నివేదిక లేదు. అయితే, రైలులోని పలు కంపార్ట్మెంట్లు బోల్తా పడడంతో తీవ్ర గాయాలు, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పాట్నా నుండి గౌహతికి వెళ్తున్న రైలు బోగీలు బోల్తా
పాట్నా నుంచి గౌహతి కి రైలు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సంఘటన జరిగిన అనంతరం హుటాహుటిన అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నివేదికల ప్రకారం, ఈ దుర్ఘటన గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగింది. ఇంకా ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు అయినట్లు నివేదికలు లేవు. అయితే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. అకస్మాత్తుగా కుదుపు రావడంతో పలు బోగీలు బోల్తా పడ్డాయి. ప్రాణనష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు అతివేగంగా లేదు. అది గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని సమాచారం. కనుక ప్రాణ నష్టం తక్కువ వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా ఒక అంచనా.
సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు .. మొదలైన సహాయక చర్యలు
డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) మరియు అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ADRM) సంఘటనా స్థలానికి చేరుకున్నారని మరియు ఈ సంఘటనలో గాయపడిన వారిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని భారతీయ రైల్వే తెలిపింది. గౌహతి-బికనీర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో ఉన్నత స్థాయి రైల్వే భద్రతా విచారణకు ఆదేశించబడింది. రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వే హెల్ప్లైన్ నంబర్లు 03612731622, 03612731623 లను ఏర్పాటు చేసింది భారతీయ రైల్వే.
కరోనా కారణంగా రైల్లో పూర్తి సామర్ధ్యంతో లేని ప్రయాణికులు
కోవిడ్ మహమ్మారి కారణంగా కోచ్లు ఏవీ పూర్తి సామర్థ్యంతో ప్రయాణికులు లేరని అలీపువార్డ్వార్ సెక్షన్ డివిజనల్ రైల్వే మేనేజర్ దిలీప్ కుమార్ సింగ్ మీడియాతో అన్నారు. అనేక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, తాము వెళ్తున్నామని చెప్పారు. ఇది పట్టాలు తప్పిన సందర్భం. క్షతగాత్రులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణనష్టంపై వారికి ఖచ్చితమైన సమాచారం ఇంకా అందలేదని ఆయన అన్నారు .
డిసెంబర్ నెలలో దంతెవాడలో ఇదే తరహా రైలు ప్రమాద ఘటన
గత ఏడాది డిసెంబర్లో ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత దంతెవాడ జిల్లాలో కిరండూల్-విశాఖపట్నం రైల్వే సెక్షన్లో గూడ్స్ రైలుకు చెందిన 17 వ్యాగన్లు పట్టాలు తప్పిన ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.దంతెవాడ పోలీస్ సూపరింటెండెంట్ అభిషేక్ పల్లవ మాట్లాడుతూ, భాన్సీ మరియు కమలూర్ స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగిందని, జగదల్పూర్ మరియు కిరండూల్ మధ్య రైళ్ల రాకపోకల్లో అంతరాయం కారణంగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు. అయితే అప్పుడు కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సాంకేతిక కారణాల వల్ల ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు అధికారులు . ఘటనా స్థలంలో మావోయిస్టుల బ్యానర్లు, పోస్టర్లు కనిపించకపోవడంతో ఘటనలో మావోయిస్టుల ప్రమేయాన్ని అధికారులు అప్పుడు తోసిపుచ్చారు.