కర్నాటకలో ముక్కోణపు పోరు- ఒంటరిగా కాంగ్రెస్, బీజేపీ-జేడీఎస్ కు కేసీఆర్, మమత మద్దతు
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. కాంగ్రెస్, జేడీ(ఎస్) ఆ పార్టీని అధికారానికి దూరం చేసేందుకు పావులు కదుపుతున్నాయి. మరోవైపు కర్నాటక ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా మారిపోవడంతో బీజేపీ సర్వశక్తులొడ్డుతోంది.
కర్నాటకలో మరోసారి అధికారం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఈసారి మతపరమైన విభజనకు తెరదీసింది. ముస్లింలకు ఉన్న 4శాతం రిజర్వేషన్లు తొలగించి మరీ వారికి సవాల్ విసిరింది. వారికి తీసేసిన రిజర్వేషన్లను లింగాయత్, ఒక్కళిగలకు రెండుశాతం చొప్పున పంచేసింది. తద్వారా ముస్లింలు వర్సెస్ ఒక్కళిగ, లింగాయత్ వార్ కు తెరలేపింది. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి చెప్పుకోలేకే బీజేపీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు విపక్ష కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే బీజేపీ, జేడీఎస్ ఎత్తుల కారణంగా గతంలో వచ్చినట్లే వచ్చిన అధికారం పోగొట్టుకున్నకాంగ్రెస్.. ఈసారి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. బీజేపీ తరహాలోనే లింగాయత్ ల నేతృత్వంలోనే ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో పలు కొత్త హామీలు కూడా ఇస్తోంది. అలాగే రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రభావం తాలూకు సానుభూతి పవనాలు బలంగా వీస్తుండటంతో వాటిని సొమ్ముచేసుకునేందుకు అడుగులు వేస్తోంది.
అటు మూడో పక్షం జేడీఎస్ కు 2018 తరహాలో సానుకూల పరిస్ధితులు లేకపోయినా మరోసారి ఎలాగైనా తమ ఉనికి చాటుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో జేడీఎస్ నేత కుమార స్వామి ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్, టీఎంసీ వంటి పార్టీలు జేడీఎస్ తరఫున ప్రచారం చేసేందుకు అంగీకరించాయి. బీజేపీని ఎలాగైనా అధికారానికి దూరంగా ఉంచే లక్ష్యంతో ఈ రెండు పార్టీలు జేడీఎస్ కు మద్దతిచ్చేందుకు అంగీకరించాయి. మమతా బెనర్జీ ప్రభావం ఈ ఎన్నికలపై ఎంతుందో తెలియదు కానీ.. కేసీఆర్ మాత్రం హైదరాబాద్ కర్నాటక జిల్లాల్లో పర్యటించి బీజేపీ ఓటుబ్యాంకును జేడీఎస్ వైపు మళ్లించేందుకు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications