బిడ్డలను చంపిన తల్లి: భర్త చేతిలో అంతం
కోల్ కతా: కుటుంబ గొడవల కారణంగా ఒకే కుటుంబంలో ముగ్గురు హత్యకు గురై ఇంటి యజమాని చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. కోల్ కతా నగరంలోని పామ్ అవెన్యూ సమీపంలో శనివారం ఉదయం ఈ హత్యలు జరిగాయి.
పోలీసుల కథనం మేరకు నీల్ ఫాన్సెకా (49), భార్య జెస్సికా, 16 సంవత్సరాల కుమారులు (కవలలు), కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఐదుగురు కలిసి రెస్టారెంట్ కు వెళ్లి డిన్నర్ చేశారు. తరువాత సరదాగా పలు చోట్ల సంచరించారు.
రాత్రి అందరూ ఇంటికి చేరుకున్నారు. ఆ సందర్బంలో ఏదో విషయంలో దంపతులు ఇద్దరూ గొడవపడ్డారు. చివరికి అర్దరాత్రి వారి కుమార్తె ఓ గదిలో, కుమారులు ఓ గదిలోకి వెళ్లి నిద్రపోయారు. దంపతులు వేరు వేరు గదులలో నిద్రపోయారు.
శనివారం ఉదయం నీల్ స్నానం చెయ్యడానికి కుమారులు ఉన్న బెడ్ రూంలోకి వెళ్లాడు. అప్పటికే జెస్సికా 8వ తరగతి చదువుతున్న ఇద్దరు కుమారుల గొంతులు కోసివెయ్యడంతో వారు బెడ్ మీద కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.
సహనం కొల్పోయిన నీల్ పదునైన ఆయుధంతో భార్య మీద దాడి చేశాడు. జెస్సికా భర్త మీద దాడి చేసింది. తీవ్రగాయాలైన ఇద్దరు కుప్పకూలిపోయారు. వేరే గదిలో నిద్రపోతున్న వీరి కుమార్తెకు ఎలాంటి కేకలు వినపడకపోవడంతో అక్కడికి వెళ్లలేదు.
చివరికి నీల్ కుమార్తె విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కొనఊపిరితో ఉన్న నీల్ ను ఆసుపత్రికి తరలించారు. జెస్సికా సంఘటనా స్థలంలో మరణించింది. జెస్సికా, ఆమె ఇద్దరు కుమారుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.