గవర్నర్ గిరీ: చట్టం ప్రకారమని రాజ్నాథ్, తెరాస నిరసన
న్యూఢిల్లీ/హైదరాబాద్: గవర్నర్ అధికారాల పైన లోకసభలో సోమవారం వాడిగా వేడిగా చర్చ సాగింది. తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు సభను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రాల అధికారాలు కాపాడాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారమే ప్రకారమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కామన్ క్యాపిటల్గా ఉన్న హైదరాబాద్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం గవర్నర్కు ప్రత్యేక అధికారాలు దఖలు చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి రాజధానిలో సీమాంధ్రుల భద్రత గవర్నర్ బాధ్యతే అని విభజన చట్టంలోనే ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు దెబ్బతీయాలన్నది తమ ఉద్దేశం కాదన్నారు.

ఏపీ బిల్లు రూపకల్పన చేసింది యూపీఏ ప్రభుత్వమేనని చెప్పారు. విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని చెప్పారు.చర్చలో భాగంగా విభజన చట్టం-సెక్షన్ 8లోని అంశాలను రాజ్నాథ్ లోక్సభలో చదివి వినిపించారు. చట్టంలో ఉన్నదే తాము చేశామని, కొత్తగా చేసిందేమీ లేదన్నారు. గవర్నర్ అధికారాలపై చట్టంలో స్పష్టంగా ఉందని చెప్పారు.
ఉమ్మడి రాజధానిలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ బాద్యత గవర్నర్దేనని విభజన చట్టం క్లాజ్-8లో ఉందన్నారు. కేంద్రం నియమించిన ఇద్దరు సలహాదారుల సూచనల మేరకు గవర్నర్ వ్యవహరిస్తారని చట్టంలో ఉందన్నారు. కేంద్రం ఇప్పటికే ఇద్దరు సలహాదారులను నియమించిందని చెప్పారు. రాజ్ నాథ్ సింగ్ ప్రకటన పైన తెరాస ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను రెండు గంటలకు వాయిదా వేశారు.
ఉమ్మడి రాజధాని హైదరాబాదులో శాంతిభద్రతల బాధ్యతలను గవర్నర్కు అప్పగించాలన్న కేంద్ర హోంశాఖ ప్రతిపాదనల పైన తెరాస ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాదులో గవర్నర్కు అధికారాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని, అందరికీ న్యాయం చేస్తామని హోంమంత్రి ఇప్పుడే చెప్పారని, హోంమంత్రి చెప్పిన మేరకు తెలంగాణకు కూడా న్యాయం చేయాలన్నారు.












Click it and Unblock the Notifications