సీన్ రివర్స్: ఆత్మరక్షణలో పన్నీరు, మోడీకి శశికళ షాక్!
తమిళనాట రసవత్తర రాజకీయం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం రాజ్ భవన్లో గవర్నర్ విద్యాసాగర రావును కలిసినప్పటి నుంచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గంలో ఉత్సాహం,
చెన్నై: తమిళనాట రసవత్తర రాజకీయం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం రాజ్ భవన్లో గవర్నర్ విద్యాసాగర రావును కలిసినప్పటి నుంచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గంలో ఉత్సాహం, అన్నాడీఎంకే అధినేత్రి శశికళ వర్గంలో నిరుత్సాహం కనిపించింది.
అయితే, ఈ రోజు (సోమవారం) అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నేత స్టాలిన్ - పన్నీరు సెల్వం భేటీ జరుగుతుందని భావించినప్పటికీ, అది జరగలేదు. స్టాలిన్ సచివాలయానికి వచ్చి వెయిట్ చేసి వెళ్లారు. ఆ తర్వాత పన్నీరు వచ్చారు.
మరోవైపు, న్యాయస్థానాలలో పన్నీరు సెల్వంకు షాక్, శశికళకు ఊరట కనిపించింది. తనకు కావాల్సిన ఎమ్మెల్యేల బలం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తనను గవర్నర్ 24 గంటల్లో పిలిచేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు రిసార్టులో ఎమ్మెల్యేలు బలవంతంగా ఉన్నట్లుగా చెప్పలేదని పోలీసులు కోర్టుకు సమర్పించారు.

సీన్ రివర్స్
అనూహ్యంగా సోమవారం తమిళనాట రాజకీయం మరో మలుపు తిరిగింది. పన్నీరు వర్గంలో ఈ రోజు ఉదయం దాకా కనిపించిన ఉత్సాహం, ఇప్పుడు కనిపించడం లేదు. అదే సమయంలో శశికళ వర్గం దూకుడుగా ముందుకు వెళ్తోంది.

సింహాన్ని.. కాబోయే సీఎంను
పరిణామాలు చూస్తుంటే దాదాపు ఎమ్మెల్యేలు మొత్తం శశికళ వైపు ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తానే ముఖ్యమంత్రిని అవుతానని కుండబద్దలు కొడుతున్నారు. అందరు ఏకమైనా నేను సింహాన్నే అని అంటున్నారు.

ఆత్మరక్షణలో పన్నీరు
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గం ఆత్మరక్షణలో పడింది. వారం రోజులు దాటినా పన్నీరు సెల్వం వైపు ఎనిమిది నుంచి పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఎంపీలు, సీనియర్ నేతలు మాత్రమే ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా శశికళ వైపునే ఉన్నారు. కానీ ఒక్కరొక్కరు చాలామంది ఎమ్మెల్యేలు పన్నీరు వైపు వచ్చినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వారం తర్వాత తిరిగి చూస్తే కనీసం పదిమంది ఎమ్మెల్యేలు కనిపించడం లేదు.

అందరు ఏకమైనా...
తమిళనాడులో అందరు ఒకవైపు, శశికళ ఇంకోవైపు ఉన్నారు. ఒక్క శశికళ అందర్నీ ఎదుర్కొంటూ వస్తున్నారు. ఓ వైపు సొంత పార్టీలో భిన్న రాగాలు, పన్నీరు సెల్వం ఎదురు తిరగడం కాగా, విపక్ష డీఎంకే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు శశికళకు వ్యతిరేకంగా ఉన్నాయి. తమిళనాట చాలామంది కార్యకర్తలు ఆమెకు నో చెబుతున్నారు. అయినప్పటికీ ఆమె తొణకలేదు... బెణకలేదు. దూకుడుగా వెళ్తోంది. ఒంటిచేత్తో తిప్పికొడుతున్నారు.

బీజేపీకి ఝలక్
శశికళకు చెక్ చెప్పి.. పన్నీరు సెల్వాన్ని సీఎం పీఠం పైన అలాగే కొనసాగింప చేయాలని బీజేపీ భావించింది. అసలు ఆమెను తొలుత పార్టీ అధినేత్రి పదవిలో కూడా కూర్చుండకుండా పావులు కదిపినట్లుగా వార్తలు వచ్చాయి. అందులో బీజేపీపై శశికళ పైచేయి సాధించారు. ఇప్పుడు సీఎం పీఠం రేసులోను బీజేపీకి రివర్స్ అవుతోంది. శశికళ దూకుడుతో కేంద్రం కూడా కలవరపడుతోందని అంటున్నారు. ఇక, చివరి నిమిషంలో శశికళను అడ్డుకొని రాజ్ భవన్ చెడ్డపేరు తెచ్చుకుందంటున్నారు.












Click it and Unblock the Notifications