టీటీవీ దినకరన్ అనే నేను, అయ్యా: ఢిల్లీకే ఝలక్, తెగించాడు: అంతేనా!
ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు ఎరవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దినకరన్ శనివారం మంచి రోజు కాదని సిద్దాంతులు చెప్పారని ఆరోజు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలంటే హడలిపోతున్నారు.
చెన్నై: రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు ఎరవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీవీ దినకరన్ ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలంటే హడలిపోతున్నారు. తనకు మరింత సమయం ఇవ్వాలని పోలీసులకు మనవి చేస్తున్నాడు.
ఈనెల 22వ తేది శనివారం టీటీవీ దినకరన్ ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. బుధవారం రాత్రి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసు అధికారుల నుంచి టీటీవీ దినకరన్ స్వయంగా సమన్లు అందుకున్నారు. అయితే శుక్రవారం దినకరన్ తాను విచారణకు రావాలంటే సమయం ఇవ్వాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసు అధికారులకు మనవి చేశారు.
రెండాకుల చిహ్నం లేదని
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అమ్మ పార్టీ పేరుతో ఎన్నికల బరిలో దిగిన టీటీవీ దినకరన్ రెండాకుల చిహ్నం లేనిదే అక్కడ గెలుపు అసాధ్యమని తేలిపోవడంతో విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బు వెదజల్లి ఎన్నికల రద్దుకు కారణమైనారు.
దినకరన్ చేసిన పనికి ఐటీ దాడులు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా దినకరన్ ఓటర్లకు భారీ మొత్తంలో నగదు వెదజల్లిన విషయం తెలుసుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ఇంటి మీద దాడులు చేశారు.
మంత్రి మెడకు చుట్టుకుంది
దినకరన్ చేసిన తప్పుకు మంత్రి విజయభాస్కర్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా విజయభాస్కర్ ఎక్కడా కనపడకుండా కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలి అంటూ నానా తంటాలు పడుతున్నారు.
అంతటితో దినకరన్ ఆగలేదు
దూకుడు మీద ఉన్న టీటీవీ దినకరన్ అంతటితో ఆగకుండా ఏకంగా రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ నే కొలుగోలు చేసేందుకు తెగించాడు. సుఖేష్ చంద్రశేఖర్ అనే బ్రోకర్ ద్వారా రూ. 50 కోట్లు ఖర్చు చేసి రెండాకుల చిహ్నం పొందే ప్రయత్నం చేశాడు.
ఢిల్లీ పోలీసుల ముందు నిందితుడు
ఎన్నికల కమిషన్ ను కొనుగోలు చేసే ప్రయత్నం బెడిసికొట్టడంతో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల చిట్టాలో టీటీవీ దినకరన్ నిందితుడిగా మారాడు. ఇప్పుడు విచారణకు రావాలని ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేస్తే నాకు సమయం కావాలని అంటున్నాడు.
ఆరోజు మంచి రోజు కాదని
ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ఆదేశాల మేరకు ఈనెల 22వ తేదీ శనివారం దినకరన్ ఢిల్లీ వెళ్లి పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలి. శనివారం అయితే అరెస్టు అవుతారని ఆయనకు సిద్దాంతులు చెప్పడంతో దినకరన్ వెనకడుగు వేస్తున్నారని సమాచారం.
మూడు రోజులు ఎందుకు ?
విచారణకు హాజరుకావడానికి మూడు రోజులు సమయం ఇవ్వాలని శుక్రవారం టీటీవీ దినకరన్ ఢిల్లీ పోలీసులకు మనవి చేశారు. అయితే ఢిల్లీ పోలీసులు ఆయనకు సమయం ఇస్తారా ? లేదా ? అనే విషయం తెలియడం లేదు.
సాక్షాలు నాశనం చెయ్యాలని ?
దినకరన్ కు సమయం ఇస్తే సాక్షాలు నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం విచారణకు హాజరుకాకుంటే నేరుగా చెన్నై వెళ్లి టీటీవీ దినకరన్ ను అరెస్టు చెయ్యడానికి ఢిల్లీ పోలీసులు సిద్దం అయ్యారని సమాచారం.