ఔట్: టీటీవీ దినకరన్ మీద తిరగబడిన చిన్నమ్మ గ్రూప్, ఎంత డబ్బు ఇస్తావ్ !
చెన్నై: ఆర్ కే నగర్ ఉప ఎన్నికల రద్దు తరువాత తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) స్థాపించిన అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం కోసం పోరాటం చేస్తున్న శశికళకు ఆమె సొంత వర్గం నాయకులు, పార్టీ కార్యకర్తలు గట్టి షాక్ ఇస్తున్నారు.
జైల్లో ఉన్న చిన్నమ్మ శశికళను అన్నాడీఎంకే పార్టీ శాస్వత ప్రధాన కార్యదర్శిగా నియమించుకుని ఉప ప్రధాన కార్యదర్శిగా పెత్తనం చెలాయించాలని ఆశపడుతున్న టీటీవీ దినకరన్ కు కార్యకర్తలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. చివరి నిమిషయంలో నాయకులు, కార్యకర్తలు ఎదురు తిరగడంతో శశికళ వర్గీయుల దిమ్మతిరిగింది.

ఎన్నికల కమిషన్ డెడ్ లైన్
ఏప్రిల్ 17వ తేదిన పన్నీర్ సెల్వం వర్గానికి రెండాకుల గుర్తు కేటాయించాలా ? శశికళ వర్గానికి ఆ చిహ్నం ఇవ్వాలా ? అనే విషయంపై ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకోనుంది. పన్నీర్ సెల్వం, శశికళ వర్గీయులు ఆరోజు కోసం ఎదురు చూస్తున్నారు.

దినకరన్ స్కెచ్
తమిళనాడులోని అన్ని జిల్లాల్లో అన్నాడీఎంకే పార్టీకి చెందిన తమ వర్గంలోని 10 లక్షల మంది కార్యకర్తల నుంచి సంతకాలు సేకరించాలని ఆపార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గత శనివారం తమ వర్గంలోని నాయకులకు సూచించారు.

సీన్ రివర్స్ కావడంతో
అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు అందరూ మా వైపే ఉన్నారని ఎన్నికల కమిషన్ ముందు బలనిరూపణకు దిగాలని టీటీవీ దినకరన్ నిర్ణయించారు. కనీసం 10 లక్షల మంది అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించారు. అయితే ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు రద్దుకావడంతో ఆయన ప్లాన్ రివర్స్ అయ్యింది.

ఎంత డబ్బులు ఇస్తారో చెప్పండి
10 లక్షల మంది కార్యకర్తల దగ్గర సంతకాలు చేయించి చిన్నమ్మ శశికళకు పార్టీలో తిరుగులేదని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్న దినకరన్ కు ఆయన వర్గంలోని నాయకులు గట్టి షాక్ ఇచ్చారు. డబ్బులు ఇస్తేనే సంతకాలు చేస్తామని కార్యకర్తలు ఎదురుతిరుగుతున్నారని, మేము ఇప్పుడు ఏమీ చెయ్యలేమని నాయకులు చేతులు ఎత్తేశారు.

ఆర్ కే నగర్ దెబ్బ
ఇంత కాలం శశికళ వర్గంలో ఉన్న నాయకులు ప్రస్తుత పరిస్థితిలో అక్కడి నుంచి జారుకోవడమే మంచిదని భావిస్తున్నారని సమాచారం. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు రద్దు కావడం, ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంలోని మంత్రుల మీద ఆరోపణలు రావడంతో ఆ వర్గంలోని ఎమ్మెల్యేలతో సహ నాయకులు వారితో మాట్లాడాలంటే భయపడుతున్నారని సమాచారం.

కాలం కాలసిరాలేదు అంతే
అందుబాటులో ఉన్న నాయకులతో బుధవారం సమావేశం అయిన దినకరన్ ఇప్పుడు ఏం చేద్దాం అంటూ వారితో చర్చించారని తెలిసింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా చేసిందంతా చేసేసి ఇప్పుడు మమ్మల్ని అడిగితే మేం ఏం చేస్తాం అని కొందరు నాయకులు అసహనం వ్యక్తం చేశారని సమాచారం.

చేతులు ఎత్తేసిన నాయకులు
ఏప్రిల్ 17వ తేదీన అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు 10 లక్షల సంతకాలు చేసిన పేపర్లు ఎన్నికల కమిషన్ కు ఇవ్వాలని ప్లాన్ చేసిన దినకరన్ చివరి నిమిషంలో నాయకులు చేతులు ఎత్తివేయడంతో షాక్ కు గురైనారని తెలిసింది. ఇప్పుడు కార్యకర్తలకు డబ్బులు పంపిణి చేసి సంతకాలు చేయిస్తే మొదటికే మోసం వస్తోందని హడలిపోతున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications