తమిళనాడుకే షాక్ ఇచ్చాడు: ఆర్ కే నగర్ లో నేనే అభ్వర్థి, పిచ్చిపట్టిందని !
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ నియోజక వర్గం నుంచి తానే పోటీ చేస్తానని శశికళ అక్క కుమారుడు దినకరన్ ఆయనంతకు ఆయనే ప్రకటించుకుని సొంత పార్టీ నాయకులకు షాక్ ఇచ్చారు.
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన రాధాకృష్ణనగర్ (ఆర్ కే నగర్) నుంచి అన్నాడీఎంకే పార్టీ రెండు ఆకుల గుర్తు నుంచి తానే పోటీ చేస్తానని ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్వుడు టీటీవీ. దినకరన్ ఆయనంతకు ఆయనే ప్రకటించుకుని సొంత పార్టీ నాయకులకు షాక్ ఇచ్చారు.
అనారోగ్య కారణాలతో గత సంవత్సరం సెప్టెంబర్ 22న అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత డిసెంబర్ 5వ తేదీన కన్నుమూశారు. ఆమె మరణంతో ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గం ఖాళీ అయ్యింది. ఇక్కడి నుంచి పోటీ చెయ్యాలని శశికళ భావించారు.

అయితే ఆమె ముఖ్యమంత్రి కావాలని ఆశపడి చివరికి ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఆర్ కే నగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి తాను డిప్యూటీ సీఎం కావాలని టీటీవీ దినకరన్ ఆశపడుతున్నారు.
గురువారం ఉప ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల కమిషన్ తేదీ ప్రకటించిన తరువాత టీటీవీ. దినకరన్ అన్నాడీఎంకే పార్టీ నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించుకుని సొంత పార్టీ నాయకులకు షాక్ ఇచ్చారు.
పార్టీలో నాయకులతో చర్చించకుండానే దినకరన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీలోని సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అయితే ఆర్ కే నగర్ నియోజక వర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు? అనే విషయంపై ఆ పార్టీ పెద్దలు మాత్రం నోరువిప్పడం లేదు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి కాని, ఆ పార్టీ మంత్రులు కాని ఇప్పటి వరకు టీటీవీ. దినకరన్ పోటీ చేసే విషయంలో స్పందించలేదు. జైల్లో ఉన్న చిన్నమ్మ తనను ఆర్ కే నగర్ నుంచి పోటీ చెయ్యాలని సూచించారని దినకరన్ ఆ పార్టీ నాయకులకు చెప్పుకుంటున్నారు.
అయితే దినకరన్ కు పిచ్చిపట్టి ఇలా మాట్లాడుతున్నారని, ఆయన ఎలా గెలుస్తారో చూస్తాం అంటూ ఆర్ కే నగర్ నియోజక వర్గంలోని అమ్మ అభిమానులు అంటున్నారు. దినకరన్ ప్రచారానికి వస్తే ఇక్కడి పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications