దినకరన్ ఏజెంట్ సుకేష్: తవ్వినకొద్దీ, వైఎస్ అల్లుడినంటూ...
రెండాకుల చిహ్నం కోసం టీటీవీ దినకరన్ అనుచరుడిగా వెళ్లి ఎన్నికల కమిషన్ కు రూ. 1.30 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయిన సుఖేష్ చంద్రశేఖర్ అసలు బండారం మొత్తం బట్టబయలు అయ్యింది.
బెంగళూరు/హైదరాబాద్: రెండాకుల చిహ్నం కోసం టీటీవీ దినకరన్ అనుచరుడిగా వెళ్లి ఎన్నికల కమిషన్ కు రూ. 1.30 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయిన సుఖేష్ చంద్రశేఖర్ అసలు బండారం మొత్తం బట్టబయలు అయ్యింది.
అతను గతంలో తాను పలువురు రాజకీయ నాయకుల బంధువు అంటూ పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు. ఇప్పుడు మాత్రం టీటీవీ దినకరన్ ప్రతినిధిగా ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులకు చిక్కిపోయాడు.
నేను మాజీ సీఎం మనవడు
2011 ఏప్రిల్ నెలలో తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి మనవడు అంటూ అందరినీ మోసం చేస్తూ పోలీసులకు చిక్కిపోయాడు. అప్పుడే అతని మీద కేసు నమోదు అయ్యింది.
మాజీ ముఖ్యమంత్రి కుమారుడు
2008లో బెంగళూరు నగరంలో పలు చోట్ల సంచరించిన సుఖేష్ చంద్రశేఖర్ తాను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి కుమారుడు అఖిల్ గౌడ అంటూ పలువురిని మస్కా కొట్టాడు. ఇతని మీద బెంగళూరులో కేసులు నమోదు అయ్యాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నేను
2009లో హైదరాబాద్ చేరుకున్న సుఖేష్ చంద్రశేఖర్ తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) వైఎస్. రాజశేఖర్ రెడ్డి అల్లుడు అంటూ స్థానికులను మోసం చేస్తూ అక్కడి నుంచి చిన్నగా జారుకున్నాడు. చివరికి ఢిల్లీ పోలీసుల చేతికి సుఖేష్ చంద్రశేఖర్ చిక్కిపోయాడు.
డజను కేసులు
సుఖేష్ చంద్రశేఖర్ మీద ఇప్పటి వరకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో డజనుకు పైగా కేసులు నమోదు అయ్యాయి. సులభంగా డబ్బు సంపాదించడానికి ఇతను వీవీఐపీల కుటుంబ సభ్యుడు అని చెప్పకుంటూ తిరుగుతున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.
విలాసవంతమైన కార్లు
తక్కువ ధరకు విలాసవంతమైన కార్లు తీసిస్తానని నమ్మించి పలువురిని మోసం చేశాడని ఆరోపిస్తూ 2011లో బెంగళూరు నగరంలోని కబ్బన్ పార్క్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు జీవితం గడిపిన ఇతను 2013లో బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ తన పాత పద్దతినే ఫాలో అవుతున్నాడు.
లగ్జరీ లైఫ్, గన్ మ్యాన్లు
సుఖేష్ చంద్రశేఖర్ విలాసవంతమైన జీవితం గడుపుతూ తాను శ్రీమంతుల కుటుంబ సభ్యుడు అంటూ పలువురిని మోసం చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన ఫ్లాట్ ను రూ. 2. 5 లక్షల అద్దె చెల్లిస్తూ అందరినీ మోసం చేస్తున్నాడు. సఫారీ డ్రస్ వేసుకున్న వారిని సెక్యూరిటీగా పెట్టుకుని అందరినీ బురిడికొట్టిస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
దినకరన్ తో రూ. 50 కోట్లకు డీల్
రెండాకుల చిహ్నం మీకే వచ్చేటట్లు చూస్తానని టీటీవీ దినకరన్ ను నమ్మించిన సుఖేష్ చంద్రశేఖర్ రూ. 50 కోట్లకు డీల్ మాట్లాడుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గతంలో డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కుమారుడు నేను అంటూ నమ్మించి మోసం చేసిన కేసులో సుఖేష్ చంద్రశేఖర్ అరెస్టు అయ్యాడని పోలీసులు అంటున్నారు.