ఎన్నికల కమిషన్ డెడ్ లైన్: పన్నీర్, శశికళ వర్గం పోటా పోటిగా !
రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని అంటున్న శశికళ వర్గం 10 లక్షల మంది అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల నుంచి సంతకాలు సేకరించి ఎన్నికల కమిషన్ ముందు బలనిరూపణకు దిగాలని ప్లాన్ చేసింది.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ముందు వాదించడానికి శశికళ వర్గం సిద్దం అవుతోంది. పార్టీ కార్యకర్తలు మా వైపే ఉన్నారని నిరూపించుకోవడానికి సంతకాల సేకరణ చెయ్యాలని నిర్ణయించారు.
తమినాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే పార్టీకి చెందిన 10 లక్షల మంది కార్యకర్తల నుంచి సంతకాల సేకరణ చెయ్యాలని అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శనివారం ఆ పార్టీ నాయకులకు సూచించారు.
ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు
అన్నాడీఎంకే పార్టీని ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) స్థాపిస్తే ఆ పార్టీని జయలలిత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి అధికారికంగానే 1.5 కోట్ల మంది సభ్యత్వం ఉంది. తమిళనాడులో బలమైన పార్టీగా అన్నాడీఎంకే నిలిచింది.
రెండాకులు కనపడితే చాలు
అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల గుర్తు కనపడితే చాలు ఎంజీఆర్, జయలలిత మీద ఉన్న అభిమానంతో వేరే విషయం ఆలోచించకుండా ఓటు వేసే వారు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు రెండాకుల చిహ్నం కోసం పన్నీర్ సెల్వం, శశికళ వర్గం పోటీ పడుతున్నారు.
డెడ్ లైన్ పెట్టిన ఎన్నికల కమిషన్
ఈనెల 17వ తేది రెండాకుల గుర్తును ఎవరికో ఒకరి ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఏప్రిల్ 17వ తేది ఎన్నికల కమిషన్ డెడ్ లైన్ పెట్టడంతో రెండాకుల చిహ్నం దక్కించుకోవడానికి శశికళ వర్గం 10 లక్షల మంది కార్యకర్తల దగ్గర సంతకాలు సేకరిస్తున్నారు..
మా సత్తా చూపిస్తాం
ఆ సంతకాల సేకరణ పత్రాలు తీసుకెళ్లి ఎన్నికల కమిషన్ ముందు బలనిరూపణకు దిగాలని దినకరన్ ప్లాన్ వేస్తున్నాడు. తమిళనాడులోని అన్ని జిల్లాల్లో సంతకాలు సేకరణ చెయ్యాలని దినకరన్ పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు
శశికళ వర్గం ఎత్తులకు పై ఎత్తులు వెయ్యాలని పన్నీర్ సెల్వం వర్గం సిద్దం అయ్యింది. శశికళ వర్గం కంటే ఇంకా పెద్ద సంఖ్యలో కార్యకర్తల నుంచి సంతకాలు సేకరిస్తారా ? లేక వేరే ఎత్తులు వేస్తారా ? అనే విషయం వారు బయటకు చెప్పడం లేదు. మొత్తం మీద రెండాకుల గుర్తు ఏ వర్గానికి వస్తోందో వేచి చూడాలని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.