బుల్లితెర 'ఆనంది' మృతిలో ట్విస్ట్: నోట్లో ఏముంది?
ముంబై: చిన్నారి పెళ్లికూతురు సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ, ఆమె ప్రియుడు రాహుల్ రాజ్సింగ్ తాగి కొట్టుకునేవారని చెబుతున్నారు. ప్రత్యూష మరణం విషయంలో రాహుల్ రాజ్సింగ్నే వేలెత్తి చూపుతున్నారు. వాళ్లిద్దరు కొంత కాలం బాగానే ఉన్నారని, ఆ తర్వాత ఇరువురి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో వాళ్లిద్దరు తాగి తరుచుగా గొడవపడేవాళ్లని స్థానికులు కూడా చెబుతున్నారు. ప్రత్యూష మరణం తర్వాత రాహుల్ ప్రవర్తన కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. తొటి నటీనటులు అతడికి కాల్ చేశారు. అయితే, అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఉంది. దీంతో అతనిపై అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె మరణం వెనక బలమైన కారణం ఏదో ఉండి ఉంటుందని స్థానికులు, తోటినటీనటులు అంటున్నారు. ఈ స్థితిలో పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప అసలు విషయం బయట పడేట్లు లేదు. ప్రత్యూష సూసైడ్ నోట్పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు ఆమె ఏ విధమైన సూసైడ్ నోట్ రాయలేదనే మాట వినిపిస్తూ వస్తోంది. అయితే, తాజాగా ఆమె ఓ నోట్ రాసిందని అనధికార వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే ఆమె ఏం రాసిందనేది కూడా తెలియాల్సి ఉంది. ఆమె ఎవరి మీదనైనా అనుమానాలు వ్యక్తం చేసిందా అనేది తెలియాల్సి ఉంది.
దానికి తోడు, అసలు ఆ నోటు ఆమెనే రాసిందా, ఆమె చేతి రాతతోనే ఉందా అనేది కూడా తేలాల్సి ఉంది. కాగా, రాహుల్ రాజ్సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అతని వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నట్లు సమాచారం.
'చిన్నారి పెళ్లికూతురు'హిందీలో ధారావాహికలో 'ఆనంది'గా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ప్రత్యూష బెనర్జీ(24) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హిందీలో ఆ సీరియల్ పేరు 'బాలికా వధు'. ముంబైలోని బంగూర్ నగర్ ప్రాంతంలోగల తన నివాసంలో ఆమె శుక్రవారం ఉరివేసుకొని శవమై కనిపించారు.












Click it and Unblock the Notifications