నటిపై ప్రాణాంతక దాడి: నాలుగు కత్తిపోట్లు: పరిచయస్తుడి ఘాతుకం: ఫేస్బుక్ ద్వారా
ముంబై: ప్రముఖ టీవీ నటి మాల్వీ మల్హోత్రపై ప్రాణాంతక దాడి చోటు చేసుకుంది. ముంబైలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆమెను హుటాహుటిన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వెర్సోవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ దాడిలో ఒక్కరే పాల్గొని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
యోగేష్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తి మాల్వీపై కత్తితో దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. మాల్వీ మల్హోత్ర ఫిర్యాదు మేరకు అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు వెర్సోవా పోలీసులు వెల్లడించారు. యోగేష్.. ఫేస్బుక్ ద్వారా మాల్వీకి పరిచయం అయ్యాడని చెప్పారు. తనను తాను నిర్మాతగా అతను మాల్వీతో పరిచయం ఏర్పరచుకున్నాడని అన్నారు. ఇదివరకు ఒకసారి మాత్రమే ఆమె యోగేష్ను కలిసినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు.
Recommended Video
సోమవారం రాత్రి అతను తన ఆడీ కారులో మాల్వీ నివసించే ఫ్లాట్ వద్దకు చేరుకున్నాడని, తనతో పాటు రావాల్సిందిగా బలవంత పెట్టగా ఆమె నిరాకరించారని, దీనితో అతను తన వెంట తెచ్చుకున్న కత్తితో మాల్వీపై దాడి చేసి, పారిపోయినట్లు తెలిపారు. యోగేష్ మహిపాల్ సింగ్ కోసం గాలిస్తున్నామని అన్నారు. మాల్వీ శరీరంపై నాలుగు కత్తిపోట్లు ఉన్నాయని వెర్సోవా పోలీసులు పేర్కొన్నారు. సకాలంలో ఆమెను ఆసుపత్రికి తరలించడం వల్ల ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. ఆమెకు సర్జరీ చేసినట్లు చెబుతున్నారు. యోగేష్ ఆమెపై దాడి చేయడానికి కారణమేంటనేది ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు.