నా భర్త కత్తితో బెదిరించాడు: బాలీవుడ్ నటి, నేను లేనని ట్విస్ట్
ముంబై: తన భర్త పైన నెల రోజుల క్రితం ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన బాలీవుడ్ నటి రతి అగ్నిహోత్రి, మరోసారి తన భర్త అనిల్ విర్వాని పైన ఫిర్యాదు చేసింది. గత నెలలో ఆమె తన భర్త పైన గృహహింస అంటూ ఫిర్యాదు చేసింది. తాజాగా ఆమె మరోసారి భర్త పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన భర్త ఈ నెల (ఏప్రిల్) 26వ (ఆదివారం) తేదీన తనను కత్తితో బెదిరించారని, తీవ్రంగా హెచ్చరించారని ఫిర్యాదు చేసింది. ఆమె తన భర్త నుండి తప్పించుకొని ఓ అధికారికి ఫిర్యాదు చేశారని, అతను పోలీసులకు సమాచారం అందించారని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది.
వర్లీ పోలీసులు రతి అగ్నిహోత్రి భర్త పైన సెక్షన్ 506 (ii) (క్రిమినల్ ఇంటిమిడేషన్) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు, దీనిపై ఆమె భర్త విర్వానీ ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. సమాచారం మేరకు.. అసలు తాను ఆ రోజు నగరంలోనే లేనని చెప్పడం గమనార్హం. తాను ఆ రోజు నగరంలో లేనని, నిజాలు విచారణ అనంతరం వెలుగులోకి వస్తాయని చెప్పారు.
కాగా, రతి అగ్నిహోత్రి బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించారు. ప్రముఖ పాత్రలు పోషించారు. ఏక్ దుజే కేలియే చిత్రానికి గాను ఆమెకు ఫిలింపేర్ అవార్డు వచ్చింది. తెలుగులో పున్నమి నాగు తదితర చిత్రాల్లో కూడా ఆమె నటించారు. వ్యాపారవేత్త అయిన అనిల్ విర్వాణీని 1985లో రతి వివాహం చేసుకున్నారు. వీరికి 28 ఏళ్ల తనయుడు తనూజ్ ఉన్నాడు.