ఆ 11 మంది బాలికలను ఆ దుర్మార్గుడే హత్యచేసి ఉంటాడు: సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
ఢిల్లీ: ముజాఫర్పూర్ బాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక వేధింపుల కేసులో సీబీఐ సంచలన విషయాలను బయటపెట్టింది. కనిపించకుండా పోయిన 11 మంది బాలికలను హత్యకు గురై ఉంటారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసులో భారీ ట్విస్టు చోటుచేసుకుంది. ఈ 11 మంది బాలికలను ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్ చేసిఉంటాడన్న అనుమానం వ్యక్తం చేసింది సీబీఐ. విచారణలో భాగంగా సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తుండగా.. ఓ చోట పెద్ద సంఖ్యలో ఎముకలు బయటపడ్డాయి.
11 మంది బాలికలను ఠాకూర్ హత్య చేసి ఉంటాడు
ముజఫర్పూర్ హత్యపై విచారణ చేస్తున్న సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న సమయంలో కనిపించకుండా పోయిన 11 మంది బాలికల పేర్లు వెలుగులోకి వచ్చాయని పేర్కొంది. వీరిని ఠాకూర్ బృందమే హత్య చేసి ఉంటుందన్న అనుమానాలను వ్యక్తం చేసింది సీబీఐ.నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఓ స్థలంను తవ్వగా పెద్ద సంఖ్యలో ఎముకలు బయటపడినట్లు అధికారులు కోర్టుకు తెలిపారు.
హత్యల విషయం బయటపడిందిలా...
ముజఫర్నగర్లో ఓ ఎన్జీఓ సంస్థ నడుపుతున్న షెల్టర్ హోమ్లో చాలామంది బాలికలపై అత్యాచారాలు జరిగినట్లు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఓ నివేదికను బయటపెట్టింది. దీనిపై విచారణను ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. విచారణ చేసిన సీబీఐ 21 మందిపై చార్జ్షీట్ నమోదు చేసింది. ఇందులో ప్రధాన నిందితుడిగా షెల్టర్ హోమ్ నిర్వాహకుడు ఠాకూర్ పేరును చేర్చింది. నిందితుల్లో ఒకరైన గుడ్డు పటేల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా స్మశాన వాటికలో ఓ చోట తవ్విచూడగా ఎముకలు బయటపడ్డాయి. ఇక ఈ కేసును చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మరియు జస్టిస్ దీపక్ గుప్తాలు విచారణ చేశారు.
సీబీఐ విచారణను సరిగ్గా చేయడంలేదు: పిటిషనర్
విచారణ చేసిన అత్యున్నత ధర్మాసనం సీబీఐకి నోటీసులు జారీచేస్తామని వెల్లడించింది. పూర్తి సమాచారంను నాలుగువారాల సమయంలోగా పొందుపర్చాలని ఆదేశిస్తామని పేర్కొంది.ఇదిలా ఉంటే సీబీఐ సరైన విచారణ చేయడంలేదని పిటిషనర్ తరపున లాయర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఇందులో పెద్ద కుట్రే దాగి ఉందని న్యాయస్థానానికి తెలిపారు. అయితే సీబీఐ వాదన వినకుండా నోటీసులు జారీ చేయగలమా అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే ఇప్పటికే సీబీఐ సమాధానం ఫైల్ చేసిందని విచారణ సంస్థ తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. సీబీఐపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఆ సంస్థ తనపని సక్రమంగానే నిర్వర్తిస్తోందని కేకే వేణుగోపాల్ తెలిపారు. అసలైన నిందితులను కాపాడే ప్రయత్నం సీబీఐ చేస్తోదన్న వాదనల్లో నిజం లేదన్నారు.
అన్నికోణాల్లో విచారణ జరుపుతున్నాం: సీబీఐ
ముజఫర్పూర్ బాలికల వసతి గృహంలో మొత్తం 35 మంది బాలికలు ఒకే పేరుతో ఉన్నారని అప్పుడప్పుడు కొందరు ఈ గృహాన్ని వీడి తిరిగి వచ్చేవారని సీబీఐ పేర్కొంది. బాలిక గృహాల్లో ఉన్నవారిని విచారణ చేయగా వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా అన్ని స్మశానవాటికలను స్థానిక పోలీసుల సహకారంతో సీబీఐ తవ్వి చూసిందని చెప్పారు. అంతేకాదు ఠాకూర్కు చెందిన బయటి స్నేహితులు బాలికలపై అత్యాచారం చేశారన్న కోణంలో కూడా విచారణ చేసి కొందరని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. అసలైన నిందితులను కాపాడుతున్నామన్న వాదనలో నిజం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది సీబీఐ.