Twitter: భారత్లో గ్రీవెన్స్ అధికారి పేరు ప్రకటన: బెంగళూరులో హెడ్ ఆఫీస్
బెంగళూరు: కొంతకాలంగా దేశంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్..తన వైఖరిని మార్చుకుంది.. మెట్టు దిగింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు లోబడి పనిచేయడానికి అంగీకరించింది. కేంద్రం రూపొందించిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రీవెన్స్ అధికారి నియామకాన్ని పూర్తి చేసింది. భారత్లో రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని నియమించింది. కొద్దిసేపటి కిందటే ఆయన పేరును ప్రకటించింది ట్విట్టర్ యాజమాన్యం. కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుంచి తుది నోటీసులను అందుకున్న తరువాత ట్విట్టర్ యాజమాన్యం యుద్ధ ప్రాతిపదికన గ్రీవెన్స్ అధికారి నియామకాన్ని చేపట్టింది. ఆ ప్రక్రియను పూర్తి చేసింది.
ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత మళ్లీ మొదటికి: కొత్తగా 41 వేల కేసులు: వీకెండ్ లాక్డౌన్
దేశంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మార్గదర్శకాలన్నీ మే 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. వాట్సప్, ఫేస్బుక్ వాటిని అనుసరిస్తోన్నాయి. కొత్త మార్గదర్శకాలకు లోబడి కార్యకలాపాలను కొనసాగిస్తామని ప్రకటించాయి. ట్విట్టర్ మాత్రం విభేదించింది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన కొత్త మార్గదర్శకాలను అనుసరించడానికి మొండికేసింది. యధాతథంగా తన కార్యకలాపాలను దేశంలో కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో- కొత్త మార్గదర్శకాలను అనుసరించడంపై ఆ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ యాజమాన్యానికి తుది నోటీసులను జారీ చేసింది. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79 కింద చివరి అవకాశాన్ని ఇస్తోన్నామని కేంద్రం తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం- ట్విట్టర్ యాజమాన్యం భారత్లో ఒక చీఫ్ కంప్లయన్సెస్ అధికారి, ఒక నోడల్ అధికారి, ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా మరో గ్రీవెన్స్ అధికారిని వేర్వేరుగా నియమించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఇటాంటి చర్యలేవీ ట్విట్టర్ యాజమాన్యం చేపట్టలేదు. కేంద్ర ప్రభుత్వం తాఖీదులను జారీ చేయడంతో మెట్టు దిగింది.
భారత్లో గ్రీవెన్స్ అధికారిని నియమించింది. భారత రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిగా వినయ్ ప్రకాష్ను నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి ప్రధాన కార్యాలయాన్ని బెంగళూరులో ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ట్విట్టర్ యూజర్ల కోసం ఆ కార్యాలయం అడ్రస్ను ప్రకటించింది. బెంగళూరు డిక్సన్ రోడ్లోని ది ఎస్టేట్ ప్రధాన కేంద్రంగా వినయ్ ప్రకాష్ తన కార్యకలాపాలను కొనసాగిస్తారని తెలిపింది. భారత్లో 1.75 కోట్ల మంది యూజర్లు ఉన్నారు ట్విట్టర్కు.