తప్పిన పెను ప్రమాదం: మెట్రో పిల్లర్ గుంతలో లైవ్ బాంబులు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో పెద్ద ప్రమాదం తప్పింది. మూడో దశ మెట్రో పనులు చేస్తుండగా కార్మికులకు ఓ మెట్రో పిల్లర్ గుంత తీస్తుండగా రెండు పాత లైవ్ బాంబు లభ్యమైంది. అయితే, అది వెలికితీసే సమయంలో పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
సమాచారం అందుకున్న బాంబు నిర్వీర్య బృందం హుటాహుటిన ఆ స్థలానికి చేరుకుని.. రెండు బాంబులను నిర్వీర్యం చేశారు. వాటిని ఫోరెన్సిక్ లాబోరేటరీలో పరీక్షించేందుకు తీసుకెళ్లారు. అయితే, ఘటనా స్థలంలో చిన్న పేలుడు సంభవించింది. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో మెట్రో పిల్లర్ గుంత తీస్తుండగా తమకు ఓ అనుమానాస్పద వస్తువు దొరికిందంటూ పోలీసులకు ఫోన్ వచ్చింది. రోడ్డు ఉపరితలానికి ఓ మీటర్ లోతు తవ్వకాలు జరిపిన తర్వాత ఆ వస్తువు బయటపడింది.
దీంతో పోలీసులు బాంబ్ స్క్వాడ్ కు ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి వచ్చిన బాంబ్ స్క్వాడ్ వాటిని నిర్వీర్యం చేశాయి. ఆ బాంబుల్లో స్ప్లింటర్లు, నెయిల్స్ వంటివి కూడా చాలా ఉన్నాయి. కాగా, ఈ బాంబులు లభించిన చోటుకు కూత వేటు దూరంలోనే ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉండటం గమనార్హం.