డైనమిక్ సిటీ చేరుకున్నా - కార్యవర్గ సమావేశంలో మోదీ : టార్గెట్ 2024 - తెలంగాణ పైనా..!!
కేంద్రంలో హ్యాట్రిక్ సాధించి వరుసగా మరో సారి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా ప్రధాని మోదీ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్న ప్రధానికి గవర్నర్ తమిళసై.. ప్రభుత్వం నుంచి మంత్రి తలసాని..పార్టీ నేతలు స్వాగతం పలికారు. బేగంపేట నుంచి హెలికాప్టర్ లో హెచ్ఐసీసీ కి చేరుకున్నారు. ఆ వెంటనే సమావేశాలకు హాజరయ్యారు. పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా సమావేశాలను ప్రారంభించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానితో సహా నడ్డా కు స్వాగతం పలికారు.

డైనమిక్ సిటీకి వచ్చానంటూ ట్వీట్
సమావేశాల వేదిక పైన ప్రధానితో పాటుగా జేపీ నడ్డా - రాజ్యసభలో పార్టీ నాయకుడు పీయూష్ గోయల్ ఆశీసునలయ్యారు. హైదరాబాద్ లో దిగిన వెంటనే ప్రధాని మోదీ తాను డైనమిక్ సిటీకి వచ్చానంటూ ట్వీట్ చేసారు. పార్టీ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఈ రోజు.. రేపు జరిగే పార్టీ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానంగా 2024 ఎన్నికల కోసం ప్రధాని దిశా నిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటం.. క్షేత్ర స్థాయి నుంచి బలం పెంచుకోవటం పైనా పార్టీ నేతలకు మార్గ నిర్దేశనం చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రధాని పార్టీ సమావేశాల్లో పాల్గొంటారు. రేపు సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

నేడు - రేపు కార్యవర్గ సమావేశాలు
ఈ సభల కోసం పార్టీ నేతలు పెద్ద ఎత్తున జనసమీకరణతో పాటుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఈ సమావేశాల్లోనే దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ పైన ఫోకస్ పెట్టనున్నారు. ఇక, ప్రత్యేకించి తెలంగాణలోనూ పార్టీ బలోపతం పైన మార్గనిర్దేశనం చేయనున్నారు. ప్రధాని తన బహిరంగ సభ సందేశంలో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. పార్టీ కేడర్ ను వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేయటం పైన కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. సభ పూర్తయిన తరువాత ప్రధాని నేరుగా రాజ్ భవన్ కు వెళ్తారు. అక్కడే బస చేస్తారు. ఇక, ఈ సమావేశాల్లో ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్లే విధంగా తీర్మానం చేసే అవకాశం ఉంది.

తెలంగాణ పై ఏం తేల్చనున్నారు
ఇక, హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న సమావేశాలు కావటంతో జాతీయ స్థాయి అంశాలతో పాటుగా తెలంగాణకు సంబంధించి కీలక తీర్మానం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణలో పాగా వేయటమే ఇప్పుడు ప్రధాని మోదీ - అమిత్ షా లక్ష్యంగా కనిపిస్తోంది. అమిత్ షా .. రాజ్ నాధ్ సింగ్ తో సహా కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు సమావేశాలకు హాజరయ్యారు. తెలంగాణ బీజేపీ నేతలు వీరికి స్వాగతం పలికారు. ఇక, ఆదివారం ప్రధాని మోదీ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల వేదికగా ఒక సంచలన నిర్ణయం ఉండే ఛాన్స్ ఉందని పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఆ నిర్ణయం ఏంటనే అంశం పైన ఇప్పుడు ఆసక్తి కర చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications