పురిటి బిడ్డను వేలం పాటలో అమ్మేసిన డాక్టర్
ముజఫర్ నగర్: తల్లి నుంచి పురిటి బిడ్డను దూరం చేసిన డాక్టర్ తెలిసిన వారిని పిలిపించి ఆ బిడ్డను వేలం పాటలో అమ్మేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగరలో జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి మానవత్వం లేని ఆ డాక్టర్ ను అరెస్టు చేసి బిడ్డను స్వాధీనం చేసుకున్నారు.
ముజఫర్ నగరలో డాక్టర్ జితేంద్ర చౌదరి ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. ఇతని ఆసుపత్రికి ఓ అవివాహిత ప్రసవం కోసం చేరింది. సోమవారం ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత డాక్టర్ జితేంద్ర ఆమెకు పెళ్లి కాలేదని తెలుసుకున్నాడు.
తరువాత డ్రామా మొదలు పెట్టాడు. పెళ్లి కాని నీవు ఈ బిడ్డతో ఈ ప్రపంచంలో బ్రతకలేవని, ఈ సమాజానికి సమాధానం చెప్పలేవని మాయమాటలు చెప్పాడు. ఈ బిడ్డను తనకు ఇస్తే పిల్లలు లేని దంపతులకు అప్పగిస్తానని, బిడ్డ హాయిగా ఉంటుందని నమ్మించాడు.

డాక్టర్ తన మంచికే చెబుతున్నాడని ఆమె అనుకుంది. బిడ్డను చివరిసారిగా ముద్దాడి డాక్టర్ కు అప్పగించి అక్కడి నుంచి వెళ్లి పోయింది. అంతే డాక్టర్ తనకు తెలిసిన అనేక మందికి ఫోన్లు చేసి ఆసుపత్రికి రప్పించాడు. అక్కడ బిడ్డను పెట్టి రూ. రెండు వేలతో వేలం పాట మొదలు పెట్టాడు.
కలీం అహమ్మద్ అనే వ్యక్తి రూ. 20 వేలు తీసుకుని వేలం పాటకు వెళ్లాడు. అయితే బిడ్డను రూ. 50 వేలకు వేరే దంపతులకు అమ్మేశారు. నిరాశతో ఇంటికి వెళ్లిన కలీం రాత్రంతా మథనపడి మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రూ. 50 వేలకు బిడ్డను కొనుక్కోలేక తాను ఇంటికి వెళ్లి పోయానని, నిజమైన డాక్టర్ అయితే వేలం పాటలో బిడ్డను విక్రయిస్తాడా అని పోలీసుల ముందు వాపోయాడు. పోలీసులు డాక్టర్ జితేంద్ర చౌదరిని అరెస్టు చేసి బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. మీరట్ రోడ్డులోని ఆసుపత్రిలో బిడ్డకు చికిత్స అందిస్తున్నారు. బిడ్డ తల్లి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications