ఎందుకు చల్లబడ్డారు: కేజ్రీవాల్ ధర్నాపై అనుమానాలు?
న్యూఢిల్లీ: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ నగరం నడిబొడ్డున ధర్నాకు దిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం విరమించారు. కేజ్రీవాల్ ధర్నాపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాము సూచించిన ఐదుగురు పోలీసుల పైన చర్య తీసుకోవాల్సిందేనని పట్టుబట్టిన కేజ్రీవాల్.. కేవలం ఇద్దరినే సెలవులపై పంపిస్తే ఎలా సంతృప్తి చెందారని అంటున్నారు.
కేజ్రీవాల్ ధర్నా విషయంలో యూపిఏ ప్రభుత్వం పై చేయి సాధించిందా? లేక కేజ్రీవాల్ తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేశారా? అనే చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఇచ్చిముచ్చుకునే ధోరణితో వ్యవహరించడం వల్లే రిపబ్లిక్ డే వేడుకలకు ఇబ్బంది మారుతుందని భావించినందువల్లే ధర్నాకు తెరపడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో లెఫ్టినెంట్ గవర్నర్ సంప్రదింపులు జరిపి కీలక పాత్ర పోషించారట.
అంతేకాకుండా రెండు ప్రభుత్వాలు ఓ నిర్ణయానికి రావాలని ఆర్మీ చీఫ్ జనరల్ హెచ్చరికలు కూడా పని చేశాయంటున్నారు. మరో ఐదు రోజుల్లో జరగననున్న రిపబ్లిక్ డే వేడుకల కోసం, సైనిక దళాల కవాతు కోసం ధర్నా స్థలానికి దగ్గర్లోనే సన్నాహాలు జరుగుతున్నాయి. వీటిలో ఈ నెల 23వ జరిగే పూర్తిస్థాయి రిహార్సల్స్ కీలకమైనవి. ఈ నేపథ్యంలో ధర్నా ప్రాంతానికి సమీపంలో ఏదైనా జరిగితే సైన్యం బాధ్యత వహించదని ఆర్మీ చీఫ్ జనరల్ కేంద్రాన్ని హెచ్చరించారట. ఈ విషయాన్ని ప్రధాన కార్యదర్శి కేజ్రీవాల్కు సమాచారమిచ్చారు.
ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రికే పోలీసులు తమ ధర్నాను బలవంతంగానైనా అడ్డుకోవచ్చునని, అలాంటప్పుడు రెండున్నరేళ్ల క్రితం బాబా రామ్ దేవ్ దీక్ష భగ్నం సమయం నాటి పరిస్థితులు పునరావృతం కావ కేజ్రీవాల్ భావించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రాజీ ప్రతిపాదన రావడంతో ధర్నా విరమణకే కేజ్రీవాల్ మొగ్గు చూపి ఉంటారంటున్నారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో తమ ధర్నాపై కేంద్రం చర్య తీసుకునే కంటే ముందే గౌరవప్రదంగా నిరసన విరమించుకోవాలని కేజ్రీవాల్ భావించి ఉంటారంటున్నారు.
కాగా, ఢిల్లీ పోలీసు ప్రవర్తనపై పాక్షిక డిమాండ్లకు హామీ లభించటంతో కేజ్రీవాల్ దీక్ష విరమించి విషయం తెలిసిందే. ఇద్దరు పోలీసు అధికారులను సుదీర్ఘ సెలవుపై పంపటంతోపాటు, పోలీసుల ప్రవర్తనపై న్యాయ విచారణ వేగవంతం చేస్తామంటూ కేజ్రీవాల్కు లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ హామీ ఇచ్చారు.