ఆర్మీలో ఉద్యోగాలు అంటూ ఘరానామోసం, కిలాడీ లేడీలు, ఇద్దరు అరెస్టు, జ్యోతిలక్ష్మి !
బెంగళూరు: భారత సైన్యం (మిలటరి)లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను నమ్మించి మోసం చేస్తున్న ఇద్దరిని బెంగళూరు నగరంలోని హెబ్బాళ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పరారైన మరో మహిళతో సహ ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హెబ్బాళలో నివాసం ఉంటున్న కృష్ణరాజన్, సుజాత అనే ఇద్దరిని అరెస్టు చేశారు. పరారైన జ్యోతిలక్ష్మి, మెహబూబ్ బాషా కోసం పోలీసులు గాలిస్తున్నారు. కృష్ణరాజన్, సుజాత, జ్యోతిలక్ష్మి, మెహబూబ్ బాషా అనే నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాధించాలని ప్రయత్నిస్తున్న వారిని గుర్తిస్తున్నారు.
తరువాత వారికి మిలటరీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి రూ. 2 లక్షలు ఇవ్వాలని ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు. అడ్వాన్స్ గా రూ. 40 వేలు తీసుకుంటున్నారు. ఊటీ తదితర ప్రాంతాలకు నిరుద్యోగులను పిలుచుకుని వెలుతున్నారు.
ఊటీ తదితర ప్రాంతాల్లో వారికి పరిచయం ఉన్న వైద్యుల దగ్గర మెడికల్ టెస్ట్ (వైద్య పరీక్షలు) చేయించినట్లు డ్రామాలు ఆడుతున్నారు. అనంతరం నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు నిరుద్యోగులకు ఇచ్చి వారిని మోసం చేస్తున్నారు.
నిరుద్యోగులకు చిక్కకుండా ఈ నలుగురు తప్పించుకుని తిరుగుతున్నారు. దీపు శంకర్ అనే భాదితుడు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ విధంగా వీరికి నగదు ఇచ్చి ఉద్యోగాలు రాకుండా తిరుగుతున్న వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రధించాలని హెబ్బాళ పోలీసులు మనవి చేశారు. గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సుజాత అనేక మందిని మోసం చేసిందని కేసులు నమోదు అయ్యాయని పోలీసులు అన్నారు.