ఐఏఎస్, ఐపీఎస్గా ఫోజు.. ఎనిమిదేళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన కేటుగాళ్లు..
నోయిడా : వాళ్లిద్దరూ స్నేహితులు. ఒకరు బీకాం, మరొకరు బీటెక్ చదివారు. ఐఏఎస్, ఐపీఎస్ అవుదామనుకుని చివరకు ఏమీ చేయలేకపోయారు. దీంతో నకిలీ ఆఫీసర్ల అవతారం ఎత్తి వసూళ్ల దందాకు తెరతీశారు. ఇలా ఒకటి రెండు కాదు.. ఏకంగా ఎనిమిదేళ్లుగా హవా చెలాయించారు. చివరకు పోలీసులనే బెదిరించి అడ్డంగా బుక్కయ్యారు.
నోయిడాకు చెందిన గౌరవ్ మిశ్రా, అశుతోష్ రాఠీలు స్నేహితులు. ఏ పనీపాటా చేయుకుండా తిరిగే ఇద్దరూ సంపాదన కోసం వక్రమార్గం పట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లమని చెబుతూ వసూళ్ల దందాకు దిగారు. ఖాకీ యూనిఫాం, నకిలీ ఐడీ కార్డులు, బ్యాడ్జిలు ధరించి జనాన్ని భయపెట్టడం మొదలుపెట్టారు. ఎనిమిదేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగిస్తున్న ఆ కేటుగాళ్లు కొన్నాళ్లుగా పోలీసులనే టార్గెట్ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే బదిలీ చేస్తామంటూ బెదిరించారు.
వారం రోజుల క్రితం దాదాపు 20మంది పోలీసులు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. తమ గోడంతా వెల్లబోసుకున్నారు. తమకు బీజేపీ సీనియర్ న నేేత అండదండలున్నాయని బెదిరిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఉన్నాతాధికారులు విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. వారి కోసం వల పన్నారు.సెక్టార్ 18 మెట్రో స్టేషన్ వద్ద నిందితులు కారులో ప్రయాణిస్తుండగా పట్టుకున్నారు. గౌరవ్ తండ్రి ప్రయాగ్రాజ్లో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు గతంలోనూ ఇతర నేరాల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిసింది. కేసు నమోదుచేసిన పోలీసులు ఈ నకిలీ ఐఏఎస్, ఐపీఎస్ల బాధితులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునే పనిలో పడ్డారు.