కన్నడ మాట్లాడకుంటే బెంగళూరులో ఏం పని, దుమ్ములేపేశారు, కాశ్మీర్ కాదు !
బెంగళూరు: కర్ణాటకలో నివాసం ఉంటూ కన్నడ బాష మట్లాడలేదని సోదరుల మీద దాడి చేశారని ఆరోపిస్తూ బెంగళూరు నగరంలోని సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. సోదరులపై దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నామని బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఇద్దరు సోదరులు కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకుని సంజయ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఈనెల 12వ తేదీ రాత్రి ఒక హోటల్ లో భోజనం చేసిన సోదరులు కారులో ఇంటికి బయలుదేరారు.
మార్గం మధ్యలో సంజయ్ నగర్ లోని ఎన్ టీఐ ప్రాంతం సమీపంలో కొందరు యువకులు వీరి కారును అడ్డగించారు. ఎక్కడికి వెళ్లి వస్తున్నారంటూ సోదరులను ప్రశ్నించారు. సోదరులు ఇద్దరూ హిందీ, ఇంగ్లీష్ లో సమాధానం ఇచ్చారు.
ఆ సందర్బంలో కన్నడ బాషలో మాట్లాడాలని, కన్నడలో సమాధానం ఇవ్వాలని యువకులు హెచ్చరించారు. మాకు కన్నడ బాష రాదని సోదరులు ఇద్దరూ చెప్పారు. కర్ణాటకలో నివాసం ఉంటూ కన్నడ బాష ఎందుకు మాట్లాడరని సోదరుల మీద యువకులు దాడి చేశారు.
అనంతరం సోదరుల కారు మీద రాళ్లతో దాడి చేసిన యువకులు ఇది కాశ్మీర్ కాదు బెంగళూరు జాగ్రత్త అంటూ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సోదరుల మీద దాడి జరిగిన మాట నిజమే, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.