పౌరసత్వంపై మళ్లీ చెలరేగిన హింస: ఇద్దరి దుర్మరణం: పలువురికి గాయాలు..!
కోల్కత: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టంపై మరోసారి పశ్చిమ బెంగాల్లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తొలి రోజుల నుంచీ అట్టుడికిపోతూ వస్తోన్న పశ్చిమ బెంగాల్లో కొద్ది రోజులుగా శాంతియుత పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. బుధవారం ఒక్కసారిగా అక్కడి వాతావరణం వేడెక్కింది. రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారని పోలీసు అధికారులు ధృవీకరించారు.
పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లా జాలంగిలో బుధవారం బంద్కు పిలుపునిచ్చారు స్థానికులు. బంద్లో భాగంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. పలువురు ఆందోళనకారులు పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ప్రదర్శనలను చేపట్టారు. వందలాది మంది ఒకేచోట గుమికూడారు. కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై దాడులకు దిగారు. రాళ్లు రువ్వారు. ఫలితంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.

అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన నాయకులు, కార్యకర్తలు మరో నిరసన ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని కొనసాగించే అంశంపై రెండు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితులు అదుపు తప్పాయి. రాళ్లు రువ్వుకునే స్థాయికి చేరుకుంది. రెండు వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వుకున్నారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్కు చెందిన బ్లాక్ అధ్యక్షుడు తాహిరుద్దీన్ షేక్.. ఆందోళనకారులపై కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఇద్దరు ఆందోళనకారులు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. వారిని ముర్షీదాబాద్ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరిని అనరుల్ బిశ్వాస్గా గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. ఈ కాల్పుల అనంతరం జాలంగి పరిస్థితులు పూర్తిగా చేజారిపోయాయి. ప్రదర్శనకారులు వాహనాలపై దాడులకు దిగారు. వాటిని తగులబెట్టారు. సమాచారం అందుకున్న వెంటనే ముర్షీదాబాద్ జిల్లా పోలీసు అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను జాలంగికి తరలించారు.












Click it and Unblock the Notifications